ఎదులాపురం, డిసెంబర్ 11 : నిరుద్యోగులకు కల్పిస్తున్న శిక్షణ, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని డీబీసీడీవో రాజలింగు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కళాశాల, ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బీసీ స్డడీ సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం సివిల్ సర్వీసెస్ ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీబీసీడీవో మాట్లాడుతూ.. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అనేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా శిక్షణ పొందిన పలువురు అభ్యర్థులకు వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగం సాధించవచ్చని సూచించారు. సివిల్ సర్వీసెస్ ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్షకు 294 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 120 మంది హాజరయ్యారని తెలిపారు. ప్రతిభ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి హైదరాబాద్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 100 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జీ ప్రవీణ్ కుమార్, బీసీ వెల్ఫేర్ ఏవో కిశోర్, కళాశాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.