నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7 ః ఎండలు మండి పోతున్నాయి. నిర్మల్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వ్యాపార, వాణిజ్య ప్రదేశాలు, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇండ్లలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, అప్రమత్తతే ఆయుధం అని అధికారులు అంటున్నారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించి, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్లలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 113 అగ్నిమాపక కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రూ.1.71 కోట్ల ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి సకాలంలో మంటలను ఆర్పడంతో దాదాపు రూ.15.89 కోట్ల ఆస్తి మంటల్లో బూడిద కాకుండా కాపాడారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నిర్మల్ ప్రాంతం వారు 8712699218, భైంసా 8712699220, ఖానాపూర్ 8712699222 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని నిర్మల్ జిల్లా ఫైర్ అధికారి ప్రభాకర్ తెలిపారు.