వెబ్కాస్టింగ్ ద్వారా కేంద్రాల పర్యవేక్షణ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 91.78 శాతం ఓటింగ్
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం, డిసెంబర్ 10: శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలోని కంట్రోల్ రూమ్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పొలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ద్వారా శుక్రవారం పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లాలోని 8 పోలింగ్ కేంద్రాల్లో 91.78 శాతం ఓట్లు పోలైనట్లు కలెక్టర్ తెలిపారు. ఆదిలాబాద్లో 88.95 శాతం, ఉట్నూర్లో 97.62 , మంచిర్యాలలో 82.21, బెల్లంపల్లిలో 86.36, నిర్మల్లో 100 శాతం, భైంసాలో 97.06 శాతం, ఆసిఫాబాద్లో 97.10, కాగజ్నగర్లో 97.82 శాతం ఓట్లు పోలైనట్లు వివరించారు. ఈ వెబ్ కాస్టింగ్ పరిశీలనలో ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్, అదనపు కలెక్టర్ ఎస్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రాజేశ్వర్, కలెక్టరేట్ ఏవో వర్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తహసీల్దార్ అతిఖొద్దీన్, పర్యవేక్షకుడు రాజేశ్వర్, సాంకేతిక, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బందోబస్తు పర్యవేక్షణ
ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తును ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర పరిశీలించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. సీఈవో డాక్టర్ శశాంక్ గోయల్, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలికుడు నవీన్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి పోలింగ్ సరళిని పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్రూమ్ వద్ద మూడంచెల భద్రత, సీసీటీవీ కెమెరాలు, సాయుధ ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఇన్చార్జి ఎస్పీ తెలిపారు. సాయుధ బలగాలతో పహారా కొనసాగుతుందన్నారు. రిజర్వ్ సీఐ ఎం వంశీకృష్ణ ఆధ్వర్యంలో 20 మంది సాయుధ ప్రత్యేక బలగాలతో రక్షణ ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశామని చెప్పారు. అనుమతి ఉన్న ప్రత్యేక అధికారులను మాత్రమే పర్యవేక్షణకు భద్రతా బలగాలు అనుమతిస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 8 కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక పర్యవేక్షణలో తరలించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అదనపు ఎస్పీ సీ సమయ్ జాన్రావు, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఏఆర్ డీఎస్పీ ఎం విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ గుమ్మడి మల్లేశ్, సీఐలు పోతారం శ్రీనివాస్, ఎస్ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐ కే ఫణిధర్, కృష్ణమూర్తి ,రిజర్వ్ సీఐ బి.శ్రీపాల్ ,గడికొప్పుల వేణు , ఎస్ఐలు సయ్యద్ అన్వర్ ఉల్ హక్, జీ అప్పారావు తదితరులు బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.