యాంత్రీకరణపై ఆధారపడ్డ రైతులు
కష్టాల్లోకి నెట్టేస్తున్న డీజిల్ ధరలు
ట్రాక్టర్లు, హార్వెస్టర్ల అద్దె భారం
ప్రత్యామ్నాయ పంటలే మేలు
ఆదిలాబాద్, నవంబర్ 10 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి):వ్యవసాయ యాంత్రీకరణ రైతాంగానికి ఎంతో మేలు చేసింది. దుక్కులు దున్నేందుకు, పంటలు కోసేందుకు యంత్రాలు అందుబాటులోకి రావడంతో, పనులన్నీ సులువుగా పూర్తవుతు న్నాయి. తక్కువ ఖర్చు, కూలీల కొరత, పంట రవాణా లాంటి సమస్యలకు చెక్ పడింది. కానీ ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలతో యంత్రాల వాడకం ఖర్చులూ పెరిగాయి. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులకు ట్రాక్టర్, హార్వెస్టర్ అద్దె రేట్లు పెరిగి తీవ్ర భారం పడుతున్నది. ఈ భారాన్ని తప్పించుకోవాలంటే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని అధికార యంత్రాంగం సూచిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వరి పంటసాగులో భాగంగా ట్రాక్టర్లు, హార్వేస్టర్లు వాడుతారు. రెండు సీజన్లలో పొలాలను సిద్ధం చేస్తారు. దుక్కులు దున్నడం, వరి నాట్లు చేయడం, కట్టలు వేయడం లాంటి వాటికి ట్రాక్టర్లు అవసరమవుతాయి. పంట కోతకు వచ్చిన తర్వాత హార్వేస్టర్ల ద్వారా తీస్తారు. వడ్లను ట్రాక్టర్లలో మార్కెట్ తీసుకెళ్తారు. డీజిల్, డ్రైవర్, ఇతర ఖర్చుల ఆధారంగా యజమానులు ధరలు నిర్ణయిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఏడాదిగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వరి సాగు చేసే రైతుల పాలిట శాపంగా మారాయి. కిరాయిలు బాగా పెరిగిపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. రైతులు యంత్రాలకు అలవాటు పడిన నేపథ్యంలో పెరుగుతున్న చమురు ధరలు వరి రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక్కోసారి పెట్టుబడులూ రాక నష్టపోవాల్సి వస్తున్నది.
పంటలు మారిస్తేనే లాభం…
నేను నిరుడు యాసంగిల గోధుమ, జొన్న పంటలు వేసిన. ఈ యేడు కూడా అవే వేయాలనుకుంటున్న. ఈ పంటలు వేస్తే కష్టం తక్కువ. రైతులకు మంచి దిగుబడి వస్తుంది. అందుకే ప్రభుత్వం, ఆఫీసర్లు చెప్పినట్లుగా వరికి బదులుగా రైతులు గోధుమ, జొన్న, శనగలాంటి పంటలు వేయాలి. వీటికి ఎప్పుడూ మంచి ధర కూడా ఉంటుంది. మన భూముల్ల సారం ఉండాలంటే పంటలు మార్చితేనే మంచిది. లేకుంటే దిగుబడులు తగ్గి మనకే నష్టమైతది. ఎప్పుడూ వరి వేసుడు కూడా మంచిది కాదు. ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే మేలు.
-మల్లేశ్, రైతు పొన్నారి, తాంసి మండలం
పెట్టుబడి ఖర్చులు పెరిగినయి..
ఎవుసం ఖర్చులు మస్తు పెరిగినయ్. ట్రాక్టర్తో దుక్కిదున్నుడు, రూట్వెటర్తో రొప్పుడు, వేసి న పంటను తీయడానికి హార్వెస్టర్ ఖర్చులతో రైతులు ఇబ్బందులు పడుతున్నరు. ప్రభుత్వం చెప్పినట్లుగా ఆదాయాన్నిచ్చే పంటలు వేసుకుం టే బాగుంటది. నేను సోయాబీన్, పత్తి, తొగరి వేసిన. ఇప్పటికే పత్తి, సోయాబీన్ మార్కెట్లో అమ్మిన. యాసంగిల కూడా శనగ, గోధుమ, జొన్న పంటలు వేయాలని అనుకుంటున్న. అధికారులు కూడా ప్రత్యా మ్నాయ పంటలు వేయాలని చెబుతున్నరు. అందరూ వరి వేస్తే లాభం ఉండదు. పంట మార్పిడి చేస్తేనే నేల మనకు మంచి సౌలతు ఇస్తది.
-బిట్రుంగ్ ఆశన్న, రైతు (పాలోడి, తాంసి మండలం)
రైతులకు భారం..
సోన్, నవంబర్ 10: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్ల ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కిరాయిలు పెంచేశారు. గతేడాది హార్వెస్టర్ గంటకు రూ. 1600-1800 ఉండగా, ఇప్పుడు రూ. 2వేలు ఇస్తనే వస్తమంటున్నరు. దీంతో తమకు అదనంగా భారం పడుతోంది. అదే విధంగా దుక్కులు దున్నడానికి ట్రాక్టర్ ఖర్చులు మరింత పెరిగిపోయాయి. ధరలు పెరిగిన మార్కెట్లో పండిన పంటకు ఆశించిన ధర పెంచడం లేదు.
-లెంక వినోద్, సోన్
పంట ధర పెంచాలి..
సోన్, నవంబర్ 10: కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరేండ్లలోనే పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారు. 2014లో రూ. 75 ఉన్న పెట్రోల్ రూ. 110, డీజిల్ రూ. 65 నుంచి రూ.105 కు పెంచింది. అదే రైతులు పండించిన పంటలైన పత్తి, మక్కజొన్న, ఇతర పంటల ధరలు వందల్లో మాత్రమే మద్దతు ధరను పెంచిన ప్రభుత్వం డీజిల్పై ఇంత భారాన్ని మోపడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. -సుంచు శ్రీనివాస్, రైతు, సాకెర
ఎకరాకు రూ. 3వేల ఖర్చు అదనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 220 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిల్లో రోజుకు సగటున 4.60 లక్షల లీటర్ల డీజిల్, 2.40 లక్షల పెట్రోల్ విక్రయాలు జరుగుతాయి. వారం రోజుల క్రితం వరకు పెట్రోల్ లీటరు ధర రూ.117, డీజిల్ రూ.105.74 వరకు ఉండేది. ప్రస్తుతం పెట్రోల్ లీటరకు రూ.110.99, డీజిల్ ధర లీటర్కు రూ.97.22 ఉంది. గతేడాదితో పోల్చుకుంటే డీజిల్ ధర లీటర్కు రూ.35 పెరిగింది. ఏడాది కాలంలో ఇంతలా ధరలు పెరగడం ఇంతకముందెన్నడూ లేదు.
ఖర్చు తడిసి మోపెడు
కూలీల కొరతను అధిగమించి యంత్రాల ద్వారా వ్యవసాయ పనులు చేసుకోవడం రైతులకు ప్రయోజనకరంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్లు 9843 ఉండగా, 693 ట్రిల్లర్లు, 852 వరి కోత యంత్రాలు, 553 బ్లేడ్ ట్రాక్టర్లు ఉంటాయి. వీటితో పాటు పురుగుల మందులు పిచికారీ చేయడానికి ఉపయోగించే తైవాన్, పవర్ స్ప్రేయర్లు 14,000 వరకు ఉంటాయి. పెరిగిన డీజిల్ ధరల కారణంగా వీటి ఖర్చులు డబుల్ అయ్యాయి.