మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికైన అడ్వాల పద్మ
లక్ష్మణచాంద, నవంబర్10 : మండలాభివృద్ధికి మరింత కృషిచేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. దీనికి మంత్రి అల్లోల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్మణచాంద ఎంపీటీసీ అడ్వాల పద్మ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ పద్మను మంత్రి అభినందించారు. అనంతరం అల్లోల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ అభివృద్ధిలో తాను భాగస్వామిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఎంపీపీగా ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందించాలని సూచించారు.
ప్రజాసేవకు అంకితమవుతా.. : ఎంపీపీ పద్మ
మండలాభివృద్ధికోసం సర్వత్రా కృషిచేస్తానని, ప్రజాసేవకు అంకితమవుతానని ఎంపీపీ అడ్వాల పద్మ పేర్కొన్నారు. ఎంపీపీగా ఎన్నికైన అనంతరం ఆమె మాట్లాడుతూ.. గౌరవ మండల ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రఘునందన్రెడ్డి సహకారంతో అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ఎన్నికకు కృషిచేసిన ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.