నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, నవంబర్ 10 : నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా రెవెన్యూ, ఫారెస్టు, వక్ఫ్బోర్డు ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆక్రమించుకుంటున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో బుధవారం జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో భూముల ఆక్రమణపై నివేదికలను తయారు చేసి అందించాలని సూచించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరికీ పక్కాగా అర్హత పత్రాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పోడు భూమిని ఆక్రమించుకుంటే వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీనికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వ భూముల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్, అధికారులు పాల్గొన్నారు.