ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర
ఎస్పీని కలిసిన నూతన ఎస్ఐలు
ఎదులాపురం, నవంబర్ 10 : నూతన యువ ఎస్ఐలు ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర సూచించారు. జిల్లా క్యాంపు కార్యాలయంలో నూతన ఎస్ఐలు ముత్తే ప్రవీణ్ కుమార్ (మావల), పీ ఉదయ్ కుమార్ (ఇచ్చోడ), షేక్ ఫరీద్ (మావల, రెండో ఎస్ఐ) , దడిగే రాధిక (మహిళా పోలీస్ స్టేషన్), కే ధనశ్రీ (తాంసి), మాధవేణి ప్రవళిక (తలమడుగు), కుడికల స్రవంతి (ఆదిలాబాద్ గ్రామీణ రెండో ఎస్ఐ) బుధవారం ఇన్చార్జి ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ బాధ్యతలు స్వీకరించిన యువ ఎస్ఐలు వినూత్న ఆలోచనలతో ప్రజలకు చేరువై సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా మహిళల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు. గ్రామాలను సందర్శించి మహిళలను జాగృతి చేయాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన వారికి న్యాయం చేసేలా కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలను కలిసి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, ఎస్ఐ కార్య నిర్వహణాధికారి దుర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు.