రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల కోసం తపాలా శాఖ వినూత్న సేవలు ప్రారంభించింది. పింఛన్ చెల్లింపులకు ప్రతి సంవత్సరం అవసరమయ్యే లైఫ్ సర్టిఫికెట్ను క్షణాల్లో జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం జీవన్ ప్రమాణ్ పథకాన్ని తీసుకొచ్చింది. పింఛన్దారుడు ఇందుకవసరమైన పత్రాలు సమర్పించి రూ.70 ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లిస్తే ఐదు నిమిషాల్లో డిజిటలైజ్డ్ లైఫ్ సర్టిఫికెట్ వస్తుంది. అనంతరం సంబంధిత బ్యాంకు, ఎస్టీవో ఆఫీస్కు ఆన్లైన్లో ఈ సర్టిఫికెట్ చేరుతుంది. ఈ సౌకర్యాన్ని అన్ని పోస్టాఫీసుల్లో ఇటీవలే తీసుకురావడంతో వయోవృద్ధులకు సౌకర్యంగా మారింది. ఫలితంగా సంవత్సరం వరకు పింఛన్దారులు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు.
మంచిర్యాల, నవంబర్ 10 నమస్తే తెలంగాణ : రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ రంగాల్లో పింఛన్ పొందేవారికి తపాలా శాఖ ప్రత్యేక సదుపాయం కల్పించింది. ప్రతి యేడాది లైఫ్ సర్టిఫికెట్ తీసుకుని పెన్షన్ పొందే వారికోసం డిజిటల్ సర్టిఫికెట్ను క్షణాల్లో అందించేలా చర్యలు చేపట్టింది. వీరు సంబంధిత బ్యాంకులు, ఎస్టీవోల్లో అందజేస్తే పింఛన్ తీసుకోవచ్చు. పింఛనర్లు లైఫ్ సర్టిఫికెట్ల కోసం తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. తపాలా శాఖ తీసుకున్న సరికొత్త నిర్ణయంతో పింఛన్దారులకు సమస్యలు తప్పాయి.
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
పోస్టాఫీసుల ద్వారా కాగిత రహితంగా ఆధార్ ప్రామాణీకరణతో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు పొందేందుకు ఏర్పాట్లు చేసింది. పోస్టాఫీసులున్న ఏ గ్రామంలోనైనా లైఫ్ సర్టిఫికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. దరఖాస్తుదారు పింఛన్ ఐడీతో పాటు పింఛన్ పంపిణీ విభాగం, ఆధార్ నంబర్, పింఛన్ చెల్లింపు ఆర్డర్, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్ వివరాలివ్వాలి. వీటిని పోస్టాఫీసులోని అధికారికి అందజేస్తే సంబంధిత పత్రాలు జతచేసి బయోమెట్రిక్తో వెంటనే ధ్రువీకరిస్తారు. అనంతరం లైఫ్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. పింఛన్ పొందే బ్యాంకు, ఎస్టీవో కార్యాలయాలకు ఇది ఆన్లైన్లో వెళ్తుంది. ఈ సౌకర్యాన్ని అన్ని పోస్టాఫీసుల్లో కల్పించారు.
పెన్షనర్ల కోసం పోస్టల్ శాఖ సేవలు
పింఛనర్ల సౌకర్యార్థం తపాలా శాఖ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. వయోవృద్ధులైన పింఛన్దారులకు క్షణాల్లో సర్టిఫికెట్ అందించేందుకు జీవన్ ప్రమాణ్ పథకాన్ని ప్రారంభించింది. పింఛన్ దారులు తాము అడిగిన పత్రాలతో పాటు రూ.70తో పాటు జీఎస్టీ చెల్లిస్తే ఐదు నిమిషాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. వెంటనే అప్లోడ్ చేసి, సంవత్సరం వరకు పింఛన్దారులు హాయిగా ఉండొచ్చు. ఇంటినుంచి బయటకు రాలేని పింఛన్దారుల ఇండ్లకు స్వయంగా పోస్టాఫీస్ సిబ్బంది వెళ్లి వారి సమాచారం సేకరించి లైఫ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తున్నారు.