ఎదులాపురం, నవంబర్ 10: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 5 గంటలకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ధ్రువపత్రాలులేని, పెండింగ్ చలాన్లు ఉన్న 56 బైకులు, 11 ఆటోలు, 4 ట్రాక్టర్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. మూడు బెల్ట్ షాపుల్లో రూ.10వేల విలువైన లిక్కర్ పట్టుకున్నారు. రూ.2వేల గుట్కా ప్యాకెట్లు, 30 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేసి ఆర్థిక నేరాలను కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. బెల్టుషాపులు నిర్వహిస్తున్న ముప్కాల ప్రకాశ్, కాలే జ్ఞానేశ్వర్, మచ్చేవార్ వెంకన్నను అదపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జీ ప్రదీబే ఇంట్లో సోదాలు చేసి రూ.2వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, నగునూరి లక్ష్మణ్కు చెందిన కిరాణా షాపులో 30 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఓ ఇంట్లో అనుమానాస్పదంగా దాచి ఉంచిన మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ కే పురుషోత్తమాచారి, ఎస్ఐలు ఏ హరిబాబు, షేక్ ఫరీద్, కేంద్రే రవీందర్, ముత్తే ప్రవీణ్కుమార్, దడిగే రాధిక, మాధవేని ప్రవళిక, కే ధనశ్రీ, కే స్రవంతి, టాస్క్ఫోర్స్ ఏఎస్ఐ సయ్యద్ తాజొద్దీన్తో పాటు 60 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.