ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణబాబు
తిర్యాణి మండలంలో అవగాహన సదస్సు
తిర్యాణి, అక్టోబర్ 9 : చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు అన్నారు. మండలంలోని ఏదులపాడ్, చింతపల్లి, దేవాయిగూడ గ్రామాల్లో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సుల్లో ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయన్నారు. వాటిని సంబంధిత శాఖలకు అప్పగించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తున్నామని చెప్పారు. అలాగే న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ వైవీ సుధీంద్ర, ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, ఎస్ఐ రామారావు, ఎంపీటీసీ బుర్ర రాజ్యలక్ష్మి డీటీ మస్కూర్ అలీ, సర్పంచ్లు, ప్రజలు, తదితరులు ఉన్నారు.
ఆసిఫాబాద్(వాంకిడి),అక్టోబర్9 : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ రమేశ్ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. నిరుపేదలకు మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాది విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, అక్టోబర్ 9 : చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపడితే చర్యలు తప్పవని సిర్పూర్-(యూ) ఎస్ఐ విష్ణువర్దన్ అన్నారు. సిర్పూర్-(యూ) మండలంలోని చిన్నకోహినూర్, సిడాంగూడ గ్రామాల్లో శనివారం చట్టాలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
కెరమెరి, అక్టోబర్ 9: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సివిల్ ఫస్ట్క్లాస్ న్యాయమూర్తి సరినా న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, చట్టాలను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. సదస్సులో ఎస్ఐ ఈ రమేశ్, డీటీ వెడ్మా భుజంగ్రావ్, కళాశాల ప్రిన్సిపాల్ పరశురాం, లెక్చరర్ నవీన్రెడ్డి పాల్గొన్నారు.
రెబ్బెన, అక్టోబర్ 9: మండలంలోని కైర్గాం, రెబ్బెనలో శనివారం మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్యానల్ న్యాయవాది జుమ్మిడి రాజేశ్ మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో న్యాయవాది నరహరి, ఏఎస్ఐ తిరుమల, పారా లీగల్ వలంటీర్ జయదేవ్, డాక్టర్ రాకేశ్, మెడికల్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.