పల్లె పకృతి వనంలో రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
తానూర్, ఆగస్టు 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రకృతి వనాల్లోనే రాష్ట్రంలో ఉమ్రి (కె) గ్రామం ఎంతో గుర్తింపు పొందిందని, ఈ పల్లెను ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని ఉమ్రి (కె) పల్లె పకృతి వనాన్ని సోమవారం అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి సందర్శించారు. జిల్లాలోని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శుల బృందం ఇక్కడి వచ్చింది. ముందుగా కలెక్టర్, అదనపు కలెక్టర్ కింది స్థాయి ఉద్యోగుల బృందాన్ని వనంలోకి తీసుకెళ్లి కలియ తిరిగారు. ఇక్కడ పెరిగిన చెట్లను, ప్రకృతిని ఆస్వాదించారు. పల్లె ప్రకృతి వనం పెంపొందించడానికి చేసిన కృషిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉమ్రి (కె) గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఎంతో అద్భుతంగా తయారు చేశారన్నారు. ఇది జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో టాప్లో నిలిచిందని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన సర్పంచ్ రత్నమాల, కార్యదర్శి వినయ్కుమార్, ఎంపీడీవో శ్రీనివాసరావును అభినందించారు. ఉమ్రి (కె) గ్రామ ప్రకృతివనం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లిందని కలెక్టర్ తెలిపారు. ఇక్కడి వనంలోని ఫొటోలు, వీడియోలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, త్వరలోనే తీపి కబురు అందే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఉమ్రి పల్లె ప్రకృతి వనం రాష్ట్రంలో ఒక ఉదాహరణగా ప్రభుత్వం తీసుకోబోతున్నదని గుర్తు చేశారు. జిల్లాలో 20 వరకు పల్లె ప్రకృతి వనాలు ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.
బహుమతుల ప్రకటన..
ఉమ్రి (కె) ప్రకృతివనంతో రాష్ట్రంలో మంచి పేరు వచ్చిందని, ఇందుకు కలెక్టర్ బహుమతులు ప్రకటించారు. సర్పంచ్ రత్నమాలకు రూ.15వేలు, పంచాయతీ కార్యదర్శి వినయ్కు రూ.10వేల చొప్పున నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఈ ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారని, అక్కడికి రావాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీపీవో శ్రీనివాసరావు, సర్పంచ్ రత్నమాల మారుతి, తహసీల్దార్ వెంకటరమణ, పీఏసీఎస్ చైర్మన్ నారాయణ్రావు పటేల్, వైస్ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, అధికారులు పాల్గొన్నారు.