అధికారులకు డీఆర్డీవో శేషాద్రి ఆదేశం
చెన్నూర్ రూరల్, ఆగస్టు 7: మెగా పార్కు(బృహత్ పల్లె ప్రకృతి వనం)ను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి ఆదేశించారు. చెన్నూర్ మండలంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో సుమారుగా 30 వేల మొక్కలను నాటాలని సూచించారు. నీటిని అందించి సంరక్షించాలని సూచించారు. పంచాయతీ సెక్రటరీ ప్రతి రోజూ వనాన్ని సందర్శించాలని, పనులను పరిశీలించాలని తెలిపారు. పార్కు చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సందర్శకులను ఆకట్టుకునేలా పార్కును తీర్చిదిద్దాలని తెలిపారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీవో గంగా భవాని, ఎంపీవో బీరయ్య, సర్పంచ్ భీమిని శారద, పంచాయతీ సెక్రటరీ తిరుమల, నాయకులు భీమిని శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
దళిత వాడల్లో సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి
కోటపల్లి, ఆగస్టు 7 : దళిత వాడల్లో సమస్యలపై దృష్టి పెట్టి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి సూచించారు. కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో దళిత వాడల్లో మౌలిక సదుపాయాలపై పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ దళిత వాడ ల్లో సమస్యలను పరిష్కరించాలని, ప్రతి కాలనీలో మెరుగైన రోడ్లతో పాటు పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు. దళితవాడల్లోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి నీటిని అందించాలన్నారు. కాలనీల్లో వంగిన, విరిగిన స్తంభాలు ఉంటే విద్యుత్ అధికారులకు తెలియజేయాలన్నారు. లూజ్ వైర్లను సరిచేయడంతో పాటు వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొలిపాక భాస్కర్, ఎంపీవో ముల్కల్ల సత్యనారాయణ, ట్రాన్స్కో ఏఈ జాన్ పాల్గొన్నారు.