మంచిర్యాలటౌన్, జనవరి 7: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు నెలవారి గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో శుక్రవారం మంచిర్యాల మున్సిపాలిటీ ఆవరణలో పారిశుధ్య కార్మికులు సంబురాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావులతో కూడిన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే దివాకర్రావు ఐబీ చౌరస్తాలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సిని వర్తింపజేస్తామని గతంలో సీఎం హామీ ఇచ్చారని, ఆ మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ బాలకృష్ణ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
నస్పూర్ మున్సిపాలిటీలో..
సీసీసీ నస్పూర్, జనవరి 7: నస్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే దివాకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు కొయ్యల వెంకటి మాట్లాడుతూ గతంలో తాము చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడ్డామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పెద్ద మనస్సుతో తమకు వేతనాలు పెంచడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు మాడుగుల రాజం, కదిరి రాజు, జాబ్రి హబీబ్, గొడిసెల శంకర్, బర్ల తిరుపతి, కార్మికులున్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో..
రామకృష్ణాపూర్, జనవరి 7: క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫ్లెక్సీకి కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, కౌన్సిలర్లు రేవెల్లి ఓదెలు, పారిపెల్లి తిరుపతి, అలుగుల సత్యయ్య, మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.