యేటా 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంపు లక్ష్యం
2023-24 నాటికి 850 లక్షల టన్నుల ఉత్పత్తికి చేరుకోవాలి..
నయా గనులపై సమీక్షలో సింగరేణి సీఎండీ శ్రీధర్
శ్రీరాంపూర్(మంచిర్యాల జిల్లా), సెప్టెంబర్ 6 : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో వచ్చే మూడేళ్లలో పది కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి రూపకల్పన చేశామని, వీటికి సంబంధించి ప్రతిపాదనలు, అనుమతులు త్వరితగతిన పూర్తి చేయాలని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఅండ్ఎండీ) శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్, డైరెక్టర్(ఫైనాన్స్, పర్సనల్) బలరాం, డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణరావుతోపాటు అడ్వైజర్లు ఈడీ (కోల్ మూమెంట్), ప్రాజెక్టు ప్లానింగ్, ఎస్టేట్స్, మార్కెటింగ్ తదితర శాఖల ఉన్నతాధికారులు, జీఎంలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అలాగే అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
2021-22 సంవత్సరంలో ప్రారంభించనున్న జీడీకే కోల్మైన్(ఏడాదికి 30 లక్షల టన్నులు), ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్(100 లక్షల టన్నులు), వీకే కోల్మైన్(53 లక్షల టన్నులు), జీడీకే-10లోని ఆర్జీ కోల్మైన్(60 లక్షల టన్నుల)ల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలుగా ప్రతిపాదించామని తెలిపారు. అనుమతుల తర్వాత ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. దీనితో 2021-22లో సింగరేణి సంస్థ 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందని పేర్కొన్నారు.
2022-23 సంవత్సరంలో ప్రారంభించాల్సిన ఐదు గనుల ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో ఎంవీకే ఓసీపీ(వార్షిక లక్ష్యం 25 లక్షల టన్నులు), గోలేటి ఓసీపీ(35 లక్షల టన్నులు), జేకే ఓసీపీ(15 లక్షల టన్నులు), న్యూ పాత్రపద(ఒడిశా) గనుల ప్రతిపాదనలు, అనుమతులపై చర్చించారు. ఈ గనులకు అనుమతులు లభించిన అనంతరం నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే 2023-24 నాటికి సింగరేణి సంస్థ 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందని పేర్కొన్నారు.
ఈ మూడేళ్ల కాలంలో పాత గనులు కొన్ని మూత పడుతున్న నేపథ్యంలో యేటా 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని, ఇందుకు అనుగుణంగా కొత్త గనుల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడ్వైజర్(మైనింగ్) డీఎన్ ప్రసాద్, అడ్వైజర్(ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ(కోల్ మూమెంట్) అల్విన్, జీఎం(కో-ఆర్డినేషన్) సూర్యనారాయణ, జీఎం(సీపీపీ) నాగభూషన్రెడ్డి, జీఎం(మార్కెటింగ్) రవిశంకర్, జీఎం(స్టేట్) వెంకటేశ్వర్రెడ్డి, జీఎం (పీపీ) పాలకుర్తి సత్తయ్య, జీఎం(ఎన్విరాన్మెంట్) కొండయ్య, జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్, కొత్త గనుల ఏరియా జీఎంలు వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.