రాజకీయంగా అణచి వేసేందుకే పద్మారెడ్డి ఆరోపణలు
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లిటౌన్, సెప్టెంబర్ 6 : ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలు, నియోజకవర్గాల ప్రజల ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. ఇతర పార్టీలకు మద్దతు పలుకుతూ టీఆర్ఎస్ పార్టీని అప్రతిష్టపాలు చేస్తూ, తనను కావాలనే రాజకీయంగా అణిచివేసే కుట్రలు పద్మారెడ్డి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆరోపించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనపై పద్మారెడ్డి చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఖండించారు. తాను దళిత సామాజిక వర్గానికి చెందడంతోనే తనపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెబుతున్నా ఆమె పార్టీలోనే ఉండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నదని పేర్కొన్నారు. నెన్నెల మండలం బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి హరీశ్గౌడ్ను తానే గెలిపించానని క్యాంపు కార్యాలయం సాక్షిగా ఆమె పేర్కొనడాన్ని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఆమె వార్డులో ఓడించడానికి శతవిధా లా ప్రయత్నించిందని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవి సీఎం కేసీఆర్ పెట్టిన భిక్ష, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచానని స్పష్టం చేశారు. తాను పెట్టిన భిక్ష అని పద్మారెడ్డి పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దళిత జాతిని కించపరిచేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, సీనియర్ నాయకులు గెల్లి రాజలింగు,బొడ్డు నారాయణ తదితరులున్నారు.