లక్ష్మణచాంద, ఆగస్టు 6 : గొర్రెల పంపిణీ పథకం ద్వారా యాదవ కుటుంబాల ఆదాయం పెరిగిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రాచాపూర్ గ్రామంలో గొర్రె, మేకలకు నట్టల నివారణ మందులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి ప్రారంభించారు. గతంలో రూ.1.20 లక్షలతో ఒక్క యూనిట్కు 20 గొర్రెలు, ఒక్క పొట్టేలును ప్రభుత్వం అందజేసిందన్నారు. వ్యయం పెరగడం తో ప్రస్తుతం యూనిట్ వ్యయాన్ని రూ.1.75 లక్షల కు పెంచిందన్నారు. గొర్రెల పెంపకంద్వారా గొల్ల కురుమల ఆదాయం పెరిగి సంతోషంగా జీవిస్తున్నారన్నారు. నెల రోజుల్లో రెవెన్యూ బౌండరీని తయారుచేసి, రాచాపూర్ గ్రామాన్ని చంద్రాపూర్ రెవెన్యూ గ్రామంగా మార్చాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని ఆదేశించారు.
శ్మశానవాటికకు వెళ్లే రోడ్డు సరిగా లేదని సర్పంచ్ సాతం బొర్రవ్వ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీపీ నిధుల నుంచి రూ.5లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు వెచ్చించి గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని కనకాపూర్ కేఎన్ఆర్ గార్డెన్లో లక్ష్మణచాంద, మామడ మండలాల లబ్ధిదారులలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. లక్ష్మణచాంద మండలానికి చెందిన 64 మందికి, మామడ మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, రాచాపూర్ సర్పంచ్ సాతం బొర్రవ్వ, టీఆర్ఎస్ మండల ఇన్చార్జి కొరిపెల్లి కృష్ణారెడ్డి, నాయకులు సాతం గంగారాం, ఈటెల శ్రీనివాస్, జహీరొద్దీన్, సిరాజొద్దీన్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.