యువతకు ఉపాధి వినియోగించుకుంటున్న ప్రజలు
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 5: ఆన్లైన్ సేవలు రోజరోజుకూ పెరుగుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. గతంలో పట్టణాల్లో ఉండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడికి వెళాల్సి వచ్చేది. దీంతో ప్రయాణ ఖర్చులతో పాటు గంటల తరబడి సమయం గడపాల్సి వచ్చేది. ప్రభుత్వం ఆన్లైన్ సేవలను ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. కామన్ సర్వీస్ సెంటర్ల పేరుతో మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో ప్రజల అవసరాలు తీరుతున్నాయి. యువతకు ఉపాధి లభిస్తున్నది.
సీఎస్సీల్లో అందుతున్న సేవలు
ప్రభుత్వ పథకాలకు సీఎస్సీల ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించి కిసాన్ ఈ ఫ్లోర్ వెబ్సైట్ ద్వారా విత్తనాలు, ఎరువులు, సామగ్రి కొనుగోలు చేయవచ్చు. రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు నేరుగా పొందవచ్చు. అదేవిధంగా న్యాయవాదుల దగ్గరికి వెళ్లి ఫీజు చెల్లించే స్థితిలో లేనివారు సీఎస్సీల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచిత న్యాయ సలహాలు పొందే విధానం అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ పే సిస్టంలో ఆధార్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఆన్లైన్ ద్వారా పాన్కార్డు, పాస్పోర్టు, ఆధార్ నమోదుతో పాటు పలు సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం సీఎస్సీల ద్వారా మినీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లుగా యువతను నియమించి ఉపాధి కల్పిస్తూ సేవలందిస్తున్నది. జీవిత బీమాతో పాటు ఇతర బీమా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సీఎస్సీల ద్వారా అన్ని రకాలు సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రజలకు సదుపాయం
గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్సీలు ఏర్పాటు చేయడంతో పల్లె ప్రజలు పట్టణాలకు వెళ్లే బాధ తప్పింది. ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతున్నది. ప్రతి అవసరానికి ప్రభుత్వ కార్యాలయాలకు, అధికారుల దగ్గరకు వెళ్లే అవసరం కూడా తప్పింది.
-సతీశ్, వినియోగదారుడు, శ్యాంపూర్