వ్యవసాయ శాస్త్రవేత్తలు మోహన్దాస్, రాజశేఖర్
కేవీకే, ఎఫ్టీసీలో ప్రపంచ మృత్తిక దినోత్సవం
రైతులకు భూసార పరీక్ష పత్రాలు పంపిణీ
తాంసి, డిసెంబర్ 5 : ప్రస్తుత పరిస్థితుల్లో నేల సారవంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కే రాజశేఖర్, మోహన్దాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు శిక్షణ కేంద్రంలో ఆదివారం ప్రపంచ మృత్తిక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడారు. నేల సారవంతానికి ఏటవాలుగా దున్నడం, సేంద్రియ ఎరువులను వినియోగించడం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం, పప్పు ధాన్యాలు సాగు చేయాలన్నారు. మొక్కల పెరుగుదలకు 16పోషకాలు అవసరమని, ఈ పోషకాలు భూమి సారవంతంగా ఉన్నప్పుడు లభిస్తాయన్నారు. పంట ఎరువు, చెరువు మట్టి వేయడం, మూడేళ్లకోసారి భూసార పరీక్షలు చేయించాలన్నారు. భూసార పరీక్షా కేంద్రంలో సాయిల్ టెస్ట్ రిపోర్టులను కేవలం రెండు రోజుల్లోనే అందజేస్తున్నామని ఏవో సంధ్య తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు నిహారిక, సైదా, రైతులుపాల్గొన్నారు.
కృషి విజ్ఞాన కేంద్రంలో…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ప్రపంచ నేలల దినోత్సవం నిర్వహించారు. అంకాపూర్, ఆనంద్పూర్, మాండగాడకు చెందిన 100మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ వై ప్రవీణ్కుమార్ మాట్లాడారు. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడితే నేలసారం దెబ్బతింటుందన్నారు. జిల్లాలోని రైతులు ఇక్కడి నేలలకు అనువైన పంట రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా నేలలో పోషక విలువలు పెరుగుతాయని చెప్పారు. ఈసందర్భంగా పంటక్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. భూసార పరీక్షల పత్రాలను రైతులకు అందజేశారు.