మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 5 : టీఎస్ – ఐపాస్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిర్ధేశిత కాల వ్యవధిలో అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ టీఎస్-ఐపాస్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రకారం అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. టీ-ప్రైడ్ పథకం కింద ఆరు యూనిట్లకుగాను 16.82 లక్షల పెట్టుబడి రాయితీ, ఏడు యూనిట్లకు రూ.1.167 ను పావలా వడ్డీ రాయితీ కింద మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపనకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఆసక్తి గల పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎం హరినాథ్, లీడ్ బ్యాంకు మేనేజర్ హవేలిరాజు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంచిర్యాల మేనేజర్ పుల్యా నాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.