ఊరూరా బసవన్నలకు ప్రత్యేక పూజలు
ఎడ్లకు ప్రత్యేక అలంకరణ
ఆనందోత్సహాల్లో ఇంటిల్లిపాది
బోథ్/బేల/భైంసా/కెరమెరి, సెప్టెంబర్ 5శ్రావణ మాసం ముగింపు వచ్చే బహుళ అమావాస్య రోజున పొలాల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకృతిని పూజించడంతో పాటు వ్యవసాయంలో ఆరుగాలం శ్రమించే ఎద్దులను అందంగా అలంకరించి, ఆరాధించే అరుదైన పండుగే ఇది. మట్టితో పెనవేసుకున్న మానవ బంధానికి ఈ వేడుక ఎంతో విభిన్నంగా నిలుస్తుంది. ఊరూరా అట్టహాసంగా, సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ పండుగలో ఇంటిల్లిపాది ఆనందోత్సహాల నడుమ పాలుపంచుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
శ్రావణ మాసంలో వచ్చే చివరి పండుగగా పొలాల అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలే అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రకృతితో పాటు తమ ఎడ్లను పూజించడాన్ని పండుగలా రైతన్నలు నిర్వహిస్తారు. ముందుగానే మార్కెట్కు వెళ్లి ఎడ్లకు అవసరమైన సామగ్రి, అలంకార వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యవసాయ వృత్తిని కొనసాగించే రైతన్నలకు సర్వం పశువులపైనే జీవనం ఆధారపడి ఉంది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారంలో ఎడ్లను నందిగా కొలుస్తారు. పశువులను వాగులకు తరలించి శుభ్రంగా కడుగుతారు. సాయంత్రం ఎడ్ల కొమ్ములకు రంగులు పూసి, కాళ్లకు గజ్జెలు కట్టి, శరీరమంతా అలంకరణ దుస్తులతో ముస్తాబు చేస్తారు. కొత్తగా పండిన నవధాన్యాలతో నైవేద్యం తయారు చేస్తారు. అనంతరం ఎడ్ల జతతో ఆలయానికి బయలుదేరి వెళ్తారు. ఆలయం చుట్టూ ఎడ్లను ప్రదక్షిణలు చేయించి, అక్కడే దేవుడి సాక్షిగా ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం ఇంటికి వచ్చి ఆ నైవేద్యాన్ని ఎడ్లకు తినిపించి మిగిలిన దానిని రైతులు ప్రసాదంగా భావించి ఆరగిస్తారు. దీంతో పాటు చెరువు మట్టితో ఎద్దులు, గురుగు (ప్రమిద)లను తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజించి నిండుగా నిండిన చెరువు నీటిలో వాటిని నిమజ్జనం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పొలాల పండుగలో సామాజిక అంశాలు, సంస్కృతీసంప్రదాయాలు ఉట్టి పడుతాయి .
ఎడ్లకు ప్రత్యేక పూజలు
రైతులు ఉదయమే ఆటవీ ప్రాంతానికి వెళ్లి ప్రకృతిలో విరబూసిన జంజేరు పూలు, పత్రిఆకులు, నారను తీసుకువచ్చి, వాటితో తోరణాలు తయారు చేసి, ఇంటి గుమ్మాలకు కడుతారు. వేద పండితుడు, కుల గురువులను ఇం టికి ఆహ్వానించి నీళ్లతో కాళ్లు కడిగి, పితృ దేవతలకు బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు అందజేసి రుణం తీర్చుకుంటారు. మట్టితో ఎద్దుల ప్రతిమలను తయారు చేసి పూజించి, ఉపవాస దీక్షను విరమిస్తారు. ఏడాదికోసారి వచ్చే ఈ పండగ రోజున అన్నదాతలు వ్యవసా య పనులకు దూరంగా ఉంటారు. తమకు ఏడాది పొడవునా చేదోడు వాదోడుగా ఉండే ఎద్దులకు పూజలు చేస్తారు. పండుగకు ముం దు రోజున ఎద్దులకు ఉప్పులు తినిపిస్తారు. బసవన్నలతోనే మా జీవితం ముడిపడి ఉందని రైతులు వేడుకుంటారు. వ్యవసాయ పనులకు సహకారం అందించాలని మొక్కుతారు. ఎద్దులేని రైతులు, ఇతర వర్గాల వారు మట్టి ఎడ్లకు పూజలు చేస్తారు. ఉమ్మది ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పొలాల అమావాస్యను ఘనంగా నిర్వహిస్తారు.