జైపూర్ ఏసీపీ నరేందర్ నక్కలపల్లిలో కార్డన్ సెర్చ్
కోటపల్లి, డిసెంబర్ 4 : ప్రజల భద్రతే పోలీసుల ధ్యేయమని జైపూర్ ఏసీపీ నరేందర్ అన్నారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లిలో శనివారం ఉదయం చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ కల్పించేందుకు, నేరాల నివారణకే ప్రతి గ్రామం లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. గ్రామాలకు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి షెల్టర్ తీసుకుంటే ఈ కార్డన్ సెర్చ్ ద్వారా తెలుస్తుందని, ప్రతి గ్రామాన్నీ నేర రహిత గ్రామంగా చేసేందుకు ఇలాంటి తనిఖీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వల్ల జరుగుతున్న నష్టాలు, నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గుర్తు తెలియని వారికి బ్యాంక్ అకౌంట్, ఏటీఎంల వివరాలు, మొబైల్కు వచ్చే పిన్ వివరాలను తెలుపవద్దని సూచించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపవద్దని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు, యువకులకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. కార్డన్ సెర్చ్లో భాగంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీల్వాయి ఎస్ఐ రహీం పాషా, సర్పంచ్ తోట స్రవంతి, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.