సింగరేణిలో గతేడాదితో పోలిస్తే 67 శాతం వృద్ధి
బొగ్గు అమ్మకాల్లో 81 శాతం.. విద్యుత్ అమ్మకాల్లో 19 శాతం..
శ్రీరాంపూర్ / గోదావరిఖని, అక్టోబర్ 4: సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి తొలి 6 నెలల కాలంలో రికార్డు స్థాయిలో రూ.11.920 కోట్ల అమ్మకాలు జరిపింది. గతేడాది ఇదే కాలానికి జరిపిన అమ్మకాలపై 67 శాతం వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనాతో మొదటి అర్ధ భాగంలో సింగరేణి సంస్థ రూ.7.131 కోట్ల అమ్మకాలు మాత్రమే జరుపగా, ఈ ఆర్థిక సంవత్సరంలో విస్తృత స్థాయిలో కరోనా నివారణ చర్యలు తీసుకోవడంతో గతేడాదికి మించి వృద్ధి సాధించింది. గతేడాది మొదటి అర్ధ సంవత్సరంలో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.5,573 కోట్ల అమ్మకాలు చేపట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో 81 శాతంతో వృద్ధితో రూ.10,071 కోట్ల అమ్మకాలు చేసింది. గతేడాది జరిపిన బొగ్గు అమ్మకాలపై ఈ ఏడాది అదనంగా రూ.4,499 కోట్ల అమ్మకాలు చేపట్టింది. గతేడాది మొదటి అర్ధ సంవత్సరంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా రూ.1,559 కోట్ల అమ్మకాలు చేయగా, ఈ ఏడాది అదే కాలానికి 18.6 శాతం వృ ద్ధితో రూ.1,849 కోట్ల అమ్మకాలు జరిపింది. ఇలా గత ఏడా ది విద్యుత్పై అదనంగా రూ.290 కోట్ల అమ్మకాలు సాధించగలిగింది. మొత్తం మీద సింగరేణి బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో గత ఏడాది మొదటి అర్ధ సంవత్సరం కన్నా ఈసారి అదనంగా రూ.4,789 కోట్ల అమ్మకాలు చేపట్టగలిగింది.
కరోనా నివారణ చర్యలు.. మార్కెట్ వ్యూహంతో వృద్ధి
గత ఆర్ధిక సంవత్సరంలో కరోనాతో బొగ్గు అమ్మకాలు మందగించాయి. అయినప్పటికీ, అప్పటి నుంచీ ఇప్పటి వరకు సంస్థ సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ రూ.73 కోట్ల వ్యయంతో కరోనా నివారణ చర్యలు చేపట్టారు. కార్మికులందరికీ వ్యాక్సిన్ ఇప్పించడం, నిరంతరం పర్యవేక్షణ ఫలితంగా ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకుంది. దీనికితోడు మారుతున్న బొగ్గు మార్కెట్ పరిస్థితులను కంపెనీ వ్యూహాత్మకంగా సద్వినియోగం చేసుకోవడం, కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడంతో సింగరేణి బొగ్గుకు మంచి డిమాండ్ ఏర్పడింది. డిమాండ్కు తగిన బొగ్గును వినియోగదారులకు కంపెనీ అందించడంతో గత ఏడాదితో పోల్చితే బొగ్గు అమ్మకాల్లో 81 శాతం వృద్ది సాధించగలిగింది.
మిగిలిన అర్ధ సంవత్సరంలోనూ ఇలాగే కృషి చేద్దాం..
ఇదే ఒరవడితో మిగిలిన అర్ధ సంవత్సరంలోనూ ఉత్పత్తి లక్ష్యసాధనకు కృషి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సింగరేణి బొగ్గుకు మంచి డిమాండ్ ఉందని, రానున్న కాలంలో ఇది పెరిగే అవకాశం ఉన్నదని, కనుక డిమాండ్కు తగిన విధంగా ఉత్పత్తి, రవాణా చేయడానికి సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా ఇప్పటికే మంచి పీఎల్ఎఫ్తో దేశంలోనే 2వ స్థానంలో ఉందని, ఇదే తరహాలో విద్యుత్ ఉత్పాదనను కొనసాగించి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.