రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు
పోస్టర్లు, కరదీపికలు విడుదల
యాసంగిలో 10 రకాల పంటలను సూచిస్తున్న అధికారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెంగాణ) : కేంద్రం యాసంగి వడ్లు కొనబోమని చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. వరికి బదులు వేరు శనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న, గోధుమ పండించాలని సూచిస్తున్నది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రైతులకు అవగాహన కల్పించేందుకు సన్నద్ధమైంది. ఏటా ఒకేరకమైన పంటలు వేసి నష్టపోయేకన్నా.. మార్కెట్లో డిమాండ్ ఉన్నవే పండించి లాభాలు పొందాలని చెబుతున్నది.
జిల్లాలో యాసంగిలో వరిని తగ్గించి ఇతర పంటలను సాగుచేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వరికి బదులుగా వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న పంటలను సాగుచేస్తే మంచి లాభాలు పొందడంతో పాటు మంచి డిమాండ్తో ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేగాకుండా ఏ నేలలకు ఎలాంటి పంటలు సరిపోతాయి, వాటి యాజమాన్య పద్ధతులతో పాటు, సస్యరక్షణ విషయాలను రైతులకు వివరిస్తున్నారు. ఇతర పంటల సాగుకు సంబంధించిన పోస్టర్లు, కరదీపికలను కలెక్టర్ రాహుల్ రాజ్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు.
పండించేందుకు అనేక పంటలు…
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వానకాలంలోనే కాకుండా యాసంగిలో కూడా వరి సాగు జిల్లాలో బాగా పెరిగింది. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో రైతులు ఇతర పంటలు సాగుచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం సూచించిన పది రకాల పంటలతోపాటు కూరగాయల సాగుతో పాటు వీటిలో అంతర పంటలుగా ఆకు కూరలు పండించాలని అధికారులు సూచిస్తున్నారు.
పంట మార్పిడితో ప్రయోజనం..
యేటా ఒకే రకమైన పంటలు పండిస్తే నేలల్లో సారం తగ్గిపోతుంది. ఇతర పంటలు సాగుచేస్తే మార్పిడి జరిగి మంచి లాభాలను పొందే వీలుకలుగుతుంది. వేసవిలో కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడంతో యాసంగిలో వరి కంటే కూరగాయల సాగు అధిక లాభాలను ఇస్తుంది. కూరగాయల్లో అంతర పంటల సాగుతో రైతులకు అదనపు లాభం కలుగుతుంది. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రభుత్వం సూచించిన పది రకాల పంటలతోపాటు, కూరగాయలు సాగుచేయాలని అధికారులు సూచిస్తున్నారు.