భూపాలపల్లి, అక్టోబర్ 2 : ఖాదీ వస్ర్తాలను ధరిద్దాం.. దేశీయ పరిశ్రమను కాపాడుకుందామని భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖాదీ మేళాను శనివారం జీఎం శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు స్వాతంత్య్ర సంగ్రామంలో విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమం కూడా చేపట్టారని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు దేశప్రజలందరూ స్వదేశీ ఖాదీ వాడకం ప్రారంభించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నలుమూలలా ఖాదీ పరిశ్రమలు నెలకొల్పారని, వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ కూడా అందులో భాగమేనని అన్నారు. ఇందుకోసం మహాత్మాగాంధీ స్వయంగా సబర్మతి ఆశ్రమంలో నూలు వడకడం చెప్పారు. ఖాదీ వస్ర్తాలను ధరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఖాదీ మేళా శనివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కృష్ణకాలనీలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో కొనసాగుతుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు ఐదు వాయిదాలపై సాలరీలో రికవరీ క్రెడిట్ రూపంలో రూ.10వేల వరకు ఇవ్వనున్నారని, ఈ ఖాదీ వస్ర్తాలపై 40 శాతం తగ్గింపు ఉందని, ఆసక్తి కలిగిన సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేసుకోవాలని జీఎం సూచించారు. అంతకుముందు జీఎం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ఏరియా అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం, సీనియర్ పీవో పీ రాజేశం, వావిలాల ఖాదీ వస్ర్తాలయ సేల్స్ మేనేజర్ బాబురావు పాల్గొన్నారు.