మెరుగైన వసతులు, పరిసరాల పరిశుభ్రత, వైద్యసేవలకు గుర్తింపు
జాతీయస్థాయిలో పురస్కారాలు రావడంపై వైద్యులు, ప్రజల హర్షం
కరోనా కాలంలోనూ సిబ్బంది సహకారం మరువలేనిది : వైద్యాధికారి
బజార్హత్నూర్, జూన్ 2: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కు అవార్డుల పంట పండుతున్నది. గత సెప్టెంబర్ మాసంలో కాయకల్ప అవార్డు వరించగా.. తాజాగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం విడుదల చేసిన నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్లో సర్టిఫికెట్ దక్కించుకుని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. కరోనా కాలంలోనూ నిరంతర వైద్యసేవలు, వసతుల కల్పన, రికార్డుల మెయింటె నెన్స్, పరిసరాల పరిశుభ్రత, గర్భిణులకు ప్రసవాల వంటి వాటిలో మెరుగైన పనితీరు కనబరుస్తుండడంపై పురస్కారం వరించింది. జాతీయస్థాయిలో అవార్డులు రావడంపై వైద్యులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైద్య సిబ్బంది అంకితభావం, సమష్టి కృషితో బజార్హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇప్పటికే గత సెప్టెంబర్లో కాయకల్పలో నిలిచి జిల్లా స్థాయిలో ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా గుర్తింపు పొందగా తాజాగా రాష్ట్ర క్వాలిటీ బృందం సభ్యులు దవాఖానను పరిశీలించి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్(NQAS) జాతీయ స్థాయి ఖ్యాతి దక్కింది. మండలంలోని మారుమూల తండాలు, గ్రామాల్లోని ప్రజలకు నిత్యం వైద్యసేవలు అందిస్తూ వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. మండల కేంద్రంలో ఆరు పడకలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొనసాగుతున్నది. ఇక్కడికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించేందుకు దవాఖానలో రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. దవాఖాన పరిధిలో 30 గ్రామ పంచాయతీలతో పాటు ఆరు తండాలు ఉన్నాయి. వైద్యం కోసం నిత్యం 100 మంది వరకు రోగులు వస్తుండగా, పది మంది వరకు దవాఖానలో చేరుతూ చికిత్స పొందుతున్నారు. నెలలో 10 నుంచి 15 ప్రవసవాలు జరుగుతున్నాయి. సకాలంలో వివరాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తూ కేసీఆర్ కిట్తో పాటు ప్రభుత్వం ఇచ్చే నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 95 శాతం ఇమ్యూనైజేషన్, 90 శాతం గర్భిణులకు పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా దవాఖాన కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నారు. దవాఖాన ఆవరణలో హరితహారంలో భాగంగా ఔషధ మొక్కలు నాటి పెంచుతున్నారు.
ఎంపిక ఎలా
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలు, అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తారు. ముఖ్యంగా బయటి రోగులు, దవాఖానలో చేరిన వారు ల్యాబ్ లేబర్రూం, జాతీయ కార్యక్రమాల అమలు, దవాఖాన నిర్వహణ తీరు…. ఇలా ఆరు అంశాల్లో రాష్ట్ర క్వాలిటీ కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ఎన్హెచ్ఎసార్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇక్కడ సౌకర్యాలు పరిశీలిస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికైన దవాఖానకు ఏడాది రూ.3 లక్షల చొప్పున మూడేళ్ల పాటు అందుతుంది. అందులో 25 శాతం నిధులు ఉద్యోగులకు ప్రోత్సాహకంగా అందించగా 75 శాతం దవాఖాన అభివృద్ధికి ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
అందరి సహకారం బాగుంది
అందరి సహకారంతో ప్రజలకు సకాలంలో వైద్యం అందిస్తున్నాం. ప్రజాప్రతినిధుల సహకారం, సిబ్బంది పని తీరుతో దవాఖానలో వసతులు కల్పిస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. మా సేవలను గుర్తించే జాతీయ స్థాయిలో ఈ ఖ్యాతి దక్కింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. -వైద్యాధికారి సురేశ్, బజార్హత్నూర్