నిర్మల్ జిల్లాలో 72చోట్ల ఏర్పాటు లక్ష్యం
ఇప్పటికే 20చోట్ల పనులు పూర్తి
ఉపాధి కూలీలకు చేతినిండా పని
పల్లె ప్రజల ఆరోగ్యం.. పర్యావరణ పరిరక్షణకు మేలు
సోన్, డిసెంబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉపాధిహామీ పనుల్లో ప్రాధాన్యతా క్రమంలో ప్రకృతివనాలకు కేటాయిస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున పల్లె ప్రగతి నిధులను విడుదల చేయడం, ఉపాధిహామీలో మొక్కలు నాటి సంరక్షిస్తూనే ప్రతి పల్లెలో ప్రకృతివనాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పుడు బృహత్ పల్లె ప్రకృతివనాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నది. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండలాలుండగా..72 గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పా టు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 40చోట్ల పనులు ప్రారంభించినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యమైన వాతావరణం కల్పించి పర్యావరణ పరి రక్షణకు ప్రకృతివనాలతో పాటు బృహత్ పల్లె ప్రకృతివనాలకు శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలో ఒక్కో ప్రకృతివనానికి స్థలాన్ని బట్టి రూ. 17 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే తానూర్, కుభీర్, కుంటాల, సారంగాపూర్, మామడ, నిర్మల్ రూరల్, సోన్, లోకేశ్వరం తదితర మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతవనాల ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో స్థలాన్ని బట్టి ఈ వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృహత్ పల్లె ప్రకృతివనానికి మూడున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు స్థలాన్ని సేకరించిన అధికారులు అందులో మొక్కలు నాటిస్తున్నారు.
కూలీలకు చేతినిండా పని…
బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటుతో ఉపాధిహామీ కూలీలకు చేతినిండా పనులు దొరుకుతున్నాయి. ప్రస్తుతం వానకాలం సీజన్ ముగియడంతో పనుల్లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ పనులు ఉపాధి మార్గాన్ని చూపుతున్నాయి. పల్లె ప్రకృతివనంలో భూమి చదును, ఐదెకరాల్లో పండ్లు, పూలు, డెకరేషన్, తీగజాతి మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం, చుట్టూ కంచెలు ఏర్పాటు చేయడం వంటి పనులకు పెద్ద ఎత్తున ఉపాధిహామీ కూలీలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ఈజీఎస్ సిబ్బందికి అప్పగించగా, వారు ఆ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మూడేళ్లలోనే ఈ మొక్కలన్నీ పెరిగి పెద్దవి కావడంతో ఐదెకరాలు చిట్టడివిని తలపించేలా ప్రకృతివనాలు రూపుదిద్దుకునేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే ప్రతిరోజు పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు, సలహాలు అందిస్తున్నారు.