నిర్మల్ జిల్లాలో ఒక్క రోజే రూ.1.95 కోట్ల మద్యం అమ్మకాలు
అదే బాటలో మాంసం, చేపల విక్రయాలు
పోలీసుల విస్తృత తనిఖీలు
నిర్మల్ అర్బన్, జనవరి 1 : పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా, బాసరలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సహాలతో ఘనంగా నిర్వహించుకున్నారు. మార్కెట్లో రకరకాల విందు భోజనాలు, రెడిమెడె ఫుడ్స్ కొనుగోలు చేసుకుని వేడుకలు నిర్వహించుకోగా మరికొంత మంది హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో సంబురాలు చేసుకున్నారు. మరికొంత మంది అపార్ట్మెంట్లు, కాలనీల్లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత కేకులు కట్ చేశారు. పటాకులు కాల్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
జోరుగా మద్యం అమ్మకాలు..
జిల్లాలో ఒక్క రోజే రూ.1.95 కోట్ల మద్యం అమ్మినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 47 వైన్స్లు, 6 బార్ అండ్ రెస్టారెంట్లల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. వీటిలో డిసెంబర్ 31న ఒక్క రోజే దాదాపు 11,318 కేసుల లిక్కర్ 1,896 బీర్ల కేసులు విక్రయాలు జరుగగా జిల్లా వ్యాప్తంగా రూ.1,95,65000 ఆదాయం చేకూరింది. సగటున ప్రతి రోజూ రూ.80 నుంచి 90 లక్షల ఆదాయం వస్తుండగా డిసెంబర్ 31 ఒక్క రోజే అదనంగా రూ. కోటి ఆదాయం వచ్చింది. ప్రభుత్వం అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్లు, రాత్రి 1 గంట వరకు బార్లను తెరవడంతో మందు బాబులతో వైన్స్లు, బార్లు కిటకిటలాడాయి.
మాంసం, కేక్లకు భలే గిరాకీ..
మాంసం, చేపలు, కొడి గ్రుడ్ల విక్రయాలు జోరందుకున్నాయి. పట్టణాల్లో ఫాస్ట్ ఫుడ్ సెంట ర్లు ఏర్పాటు చేయడంతో అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. పెరిగిన ధరలను లెక్క చేయకుండా కొనుగోలు చేశారు. జిల్లాలో కేక్ల విక్రయాలకు పెంచుకునేందుకు యజమానులు ఆఫర్లను ప్రకటించడంతో అమ్మకాలు జోరందుకున్నాయి.
76 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రోడ్డు ప్రమాదాల సంఖ్యను నివారించేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీలు ఉపేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్ లు విస్తృత తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 76 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.