ప్రజలకు ఉపయోగపడేలా అద్భుత ప్రయోగాలు
ఆఫ్ కాన్, మల్లీపుల్ హ్యాండ్ పంప్, ఆటోమెటిక్ టాయిలెట్ క్లీనర్, సేఫ్ డిస్టెన్సింగ్ కేర్ యంత్రాల రూపకల్పన
జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్పోటీల్లో సత్తా..
రాష్ట్ర స్థాయికి ఎంపిక
జిల్లా నుంచి సెలెక్ట్ అయిన పది ప్రాజెక్టుల్లో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలవే..
హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
నిర్మల్ అర్బన్, నవంబర్ 30;జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. తల్లిదండ్రులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వినూత్న ప్రయోగాలు చేస్తూ ప్రభుత్వం ఏటా ఇన్స్పైర్ మనాక్ పోటీల్లో ప్రైవేట్ విద్యార్థులను దాటి సత్తాచాటుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా ఇన్స్పైర్ మనాక్ పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా వ్యాప్తంగా 86 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రదర్శించారు. ఇందులో ఉత్తమ 10 ప్రాజెక్టులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత రాణి, హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దాసరి వెంకట సాయి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
పదింటిలో తొమ్మిది ప్రభుత్వ విద్యార్థులవే..
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి పది ప్రాజెక్టులు ఎంపికకగా, అందులో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు తయారు చేసినవే కావడం విశేషం. మౌనిక (గ్లాస్ క్లీనర్), డీ ప్రవళిక (పీల్ ఆఫ్ కాన్), డీ కల్యాణ్ (ఆటోమె టిక్ టాయిలెట్ క్లీనర్), ఏ ప్రవళిక (మల్టీపుల్ హ్యాండ్ పంప్), రేసు సవిజ్ఞ (పూర్ మాన్య్ కుక్కర్), జాదవ్ అనికేత్ (సేఫ్ డిస్టెన్సింగ్ కేర్) రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైన్స్ఫెయిర్లో రాణిస్తున్నారు అని చెప్పేందుకు ఇదొక్కడే నిదర్శం. విద్యార్థుల సృజనాత్మకతను చూసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నీటి పొదుపు చేయాలని..
గ్రామీణ ప్రాంత పాఠశాల్లో నీటి వృథాను అరికట్టడంతోపాటు సమయాన్ని ఆదా చేసేందుకు మల్టీపుల్ హ్యాండ్ పంప్ పరికరాన్ని తయారు చేశా. సాధారణంగా స్కూల్లో మధ్యాహ్న భోజనం టైంలో ప్లేటు కడిగేందుకు నల్లా ఆన్ చేస్తారు. ఒకే చేతి పంపు వద్ద ఒక్కరు మాత్రమే కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నీరు కూడా ఎక్కువగా వృథా అవుతుంది. అయితే అదే నల్లాకు పైప్ అమర్చి మరికొన్ని నల్లాలు అమర్చడం వల్ల 8-10 మంది విద్యార్థులు ఒకే సారి దీన్ని ఉపయోగించుకోవచ్చు. నీటి వృథా తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది.
శుభ్రత కోసం.. టాయిలెట్ క్లీనర్
ఆటోమెటిక్ టాయిలెట్ క్లీనర్ ఇది. ఐఆర్ సెన్సార్పై ఆధారపడి పనిచేస్తుంది. టాయిలెట్ బేసన్ ముందు నిలబడినపుడు సెన్సార్ గుర్తించి వాటర్ పంపు స్టార్ట్ అయి బేసన్లోకి నీరు వస్తుంది. పని ముగించుకొని వెళ్లగానే సర్క్యూట్ ఆఫ్ అవుతుంది. వాటర్ పంపు ఆగిపోతుంది. దీని వల్ల టాయిలెట్ను క్లీన్గా ఉంచుకోవచ్చు. ఎలాంటి దుర్వాసన రాదు. అతి తక్కువ దరకే దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
పేద ప్రజల కుక్కర్..
దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో మొదటిది ఇందన వనరుల సమస్య. దీని నుంచి బయట పడాలంటే ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. ఉష్ణ బంధకాలు ఉపయోగించి పూర్ మ్యాన్ కుక్కర్ రంతో ఇంధనాన్ని ఆదాచేయవచ్చు. వంట గ్యాస్తో పనిలేకుండా ఉష్ణబంధకాల వినియోగంతో ఇది పనిచేస్తుంది. అతి తక్కువ ఖర్చుతో ఈ పరికరాన్ని తయారు చేయవచ్చు.
ఇంధనం ఆదాకోసం గ్లాస్ క్లీనింగ్ మిషన్..
శీతాకాలాల్లో వాహనాల అద్దాలపై మంచు ఏకధాటిగా పడుతుంది. ప్రయాణ సమయాల్లో ఇబ్బందిగా ఉంటుంది. దీనిని తొలగించేందుకు డిఫోజర్ అనే ప్రత్యేక బటన్ ఉంటుంది. దానిని ఆన్చేసిన టైంలో అధికంగా ఖర్చు అవుతుంది. ఎటువంటి ఇందన ఖర్చు లేకుండా గ్లాస్పై మంచును తొలగించేందుకు తయారు చేసిందే ఇందన పొదుపు మిషన్.. ఇది వాహనం నడుస్తున్నపుడు విడుదలయ్యే వేడి వాయువులను అద్దాల మీదుగా పంపి ఇందనం ఖర్చు కాకుండానే మంచు తొలచేలా చేస్తుంది.