అగ్ర కథానాయకుడు సూర్య కుటుంబ కథా చిత్రంలో నటించి చాలా రోజులైంది. గత కొన్నేళ్లుగా ఆయన మాస్ అండ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. సూర్య నటిస్తున్న ఈ తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే పేరును ఖరారు చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని జూలైలో విడుదలకు సిద్ధమవుతున్నది.
సోమవారం టైటిల్ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. సూర్య ఓ చిన్నారితో కలిసి ఉన్న ఈ పోస్టర్ని చూస్తుంటే ఓ స్వచ్ఛమైన కుటుంబ చిత్రంగా తెరకెక్కించారని అర్థమవుతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కుటుంబ కథతో పాటు సమాంతరంగా నడిచే ఓ లవ్స్టోరీ ఈ కథలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.
45 ఏళ్ల కథానాయకుడిపై ఇష్టం పెంచుకునే ఇరవై ఏళ్ల అమ్మాయి, వారి బంధం తాలూకు భావోద్వేగాలు కథకు ఆయువుపట్టులా ఉంటాయని సమాచారం. మమితా బైజు, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.