అన్ని కులాల వారితో సోదరభావంతో మెలగాలి
పౌరహక్కుల దినోత్సవంలో అధికారులు
తాండూర్, సెప్టెంబర్ 30 : కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాల వారితో సోదరభావంతో మెలగాలని అధికారులు సూచించారు. తాండూర్ మండలం మాదారం పరిధిలోని పోచంపల్లిలో గురువారం సర్పంచ్ ధరావత్ సాగరిక అధ్యక్షతన నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిభాసింగ్, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జిల్లా మెంబర్ జే వెంకటేశం, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో శశికళ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులస్తులతో సమావేశం నిర్వహించి, కుల వివక్ష నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష, అగౌరవంతో మాట్లాడవద్దని తెలిపారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ ఆసియా, గిర్దావార్ ఎజాజొద్దీన్, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పౌర హక్కులపై అవగాహన పెంచుకోవాలి
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 30 : రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడూ తెలుసుకోవాలని లక్షెట్టిపేట తహసీల్దార్ రాజ్కుమార్, సీఐ కరీముల్లా పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మీపూర్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ప్రజలు కుల, మత, వర్గ, లింగ బేధాల్లేకుండా అందరూ కలిసి మెలిసి జీవించాలన్నారు. పిల్లలను చదివించాలని, బాల్య వివాహాలు అరికట్టాలని సూచించారు. మూఢనమ్మకాలు వీడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ చంద్రశేఖర్, ఎంపీటీసీ కల్లు దావీదు, గంగుల రామ్మూర్తి, ఆర్ఐ సంజీవ్, వీఆర్వో మోహన్, డీలర్ గంగుల లచ్చన్న పాల్గొన్నారు.
చట్టం ఎవరికీ చుట్టం కాదు..
హాజీపూర్, సెప్టెంబర్ 30 : చట్టం ఎవరికీ చుట్టం కాదని తప్పు చేస్తే ఎంతటి వారి నైనా శిక్షిస్తుందని హాజీపూర్ ఎస్ఐ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని రాపల్లిలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. హక్కులను ఉల్లంఘించిన వారు శిక్షార్హులన్నారు. హాజీపూర్ తహసీల్దార్ వాసంతి మాట్లాడుతూ అన్ని కులాల వారు కలిసి మెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ జిల్లా సభ్యుడు రేగుంట లింగయ్య, రాపల్లి సర్పంచ్ ఆనె మల్లేశ్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
భీమారం మండలంలో..
భీమారం సెప్టెంబర్ 30 : మండలంలో బూర్గుపల్లి గ్రామంలో సివిల్ రైట్స్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కులు, కుల వివక్ష, తదితర అంశాలపై జడ్పీటీసీ భూక్యా తిరుమల నాయక్ , ఎస్ఐ అశోక్ , ఎంపీడీవో, ఆర్ఐ అరుణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలగూర రాజ్ కుమార్ తదితరులున్నారు.