భీంపూర్, ఫిబ్రవరి 14 : అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతోనే ప్రగతి సుసాధ్యమవుతుందని తాంసి ఎంపీపీ సురుకుంటి మంజుల అన్నారు. ఎంపీపీ అధ్యక్షతన తాంసిలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం అర్హులకు అందేలా క్షేత్రస్థాయిలో మరింత శ్రద్ధతో పనిచేయాలని కోరారు. మండలంలోని ప్రతి పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సర్పంచులకు సమాచారం ఉండాలని జడ్పీటీసీ తాటిపెల్లి రాజు సూచించారు. మండలంలో అందుతున్న రైతుబంధు గురించి ఏవో రవీందర్ వివరించారు. మండల పరిషత్కు సంబంధించి ఎంపీడీవో ఆకుల భూమయ్య సభ్యులతో చర్చించారు. అనంతరం ఈజీఎస్ బడ్జెట్ అంచనా వేశారు. జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, వైస్ ఎంపీపీ రేఖ, ఎంపీడీవో ఆకుల భూమయ్య, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీటీసీలు అశోక్, వన్నెల పండిత, భాగ్యలక్ష్మి, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
జూనియర్ కళాశాల కోసం ఏకగ్రీవ తీర్మానం
భీంపూర్ మండల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ కుడిమెత రత్నప్రభ అధ్యక్షతన నిర్వహించారు. మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరుకోసం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండలంలో 10,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవిలో గడ్డి పెంపకం, నీటి కుంటలు నిర్మిస్తూ జంతుజాలానికి ఉపయోగపడే పనులు చేస్తున్నామని ఎఫ్ఎస్వో గులాబ్ వివరించారు. 26 పంచాయతీలకు గాను ఈజీఎస్ కింద రూ.75 లక్షల నిధులున్నాయని పీఆర్ డీఈ శివరాం పేర్కొన్నారు. పల్లెప్రగతి పనుల గురించి ఎంపీడీవో శ్రీనివాస్ సమీక్షించారు. మండలంలో చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సరకుల గురించి తహసల్దార్ సోము వివరించారు. వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీటీసీలు రెడ్డి దేవమ్మ, లక్ష్మి, స్వప్న, సర్పంచులు పెండెపు కృష్ణయాదవ్, జీ స్వాతిక, అజయ్, హనుమద్దాసు, జహూన్ అహ్దద్, లింబాజీ, కల్యాణి, భూమన్న పాల్గొన్నారు.