బీజేపీ నాయకుల్లారా .. ఖబడ్దార్
సీసీఐపై మాట్లాడరేం..?
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఎదులాపురం, ఫిబ్రవరి 13: ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ చేస్తున్న ఆందోళనలపై బీజేపీ నాయకులు వెకిలిచేష్టలు మానుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న హితవు పలికారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఐ లవ్ సీసీఐ’ సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగితే బీజేపీ నాయకులకు వచ్చిన ఇబ్బందులేమిటని ఆయన ప్రశ్నించారు. సిమెంట్ పరిశ్రమ ప్రారంభించాలని వారికి ఉద్దేశం ఉంటే బీజేపీ నాయకులు సెల్ఫీ దిగి ప్రధానికి పంపాలని సూచించారు. సీసీఐపై ఎంపీ సోయం బాపురావు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా సభలో ఏ ఒక్కరోజు మాట్లాడ లేదని మండిపడ్డారు. వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ విషయంలో బీజేపీ ఎంపీ తన నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. సీసీఐ పునరుద్ధరణ కేంద్రం పరిధిలోకి వస్తుందని, తాము ప్రారంభిస్తామని గతంలో కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ గంగారం చెప్పారని, ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవాలన్నారు. పరిశ్రమను రాష్ర్టానికి అప్పగిస్తే, తాము ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరినా స్పందన లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను కించపర్చే విధంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇక్కడి వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ, ఎంపీపీలు గోవర్ధన్, లక్ష్మి జగదీశ్, కౌన్సిలర్లు అజయ్, బండారి సతీశ్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
పర్ధాన్ సమాజ అభివృద్ధికి కృషి
జైనథ్, ఫిబ్రవరి 13 : పర్ధాన్ సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జైనథ్లో ఆదివారం నిర్వహించిన హీరాసుక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పర్ధాన్ కులస్తులు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఆదివాసులకు భూమి కొనుగోలు పథకం ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్తో మాట్లాడుతానని తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కమ్యూనిటీ భననాలు, హీరాసుక విగ్రహాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పర్ధాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్వ నగేశ్, డివిజన్ అధ్యక్షుడు గంగారాం, దివ్య, ఎంపీపీ గోవర్ధన్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, సంఘం మండలాధ్యక్షుడు కోవ ప్రభాకర్, కార్యదర్శి గణేశ్, నాయకులు విష్ణు, రఘురాం పాల్గొన్నారు.
డైరీ ఆవిష్కరణ
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 13 : ఆదిలాబాద్ జేడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరీలో రైతులకు ప్రయోజనకర అంశాలు పొందుపర్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జైనథ్ మండలాధ్యక్షుడు లింగారెడ్డి, సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అశ్రఫ్, శివకుమార్, కోశాధికారి వివేక్, ప్రతినిధులు విశ్వామిత్ర ,శ్రీనివాస్రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.