పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
శ్రీరాంపూర్, మార్చి 30 : నకిలీ విద్యార్థి సంఘాల నాయకులు మహిళా ఉపాధ్యాయులపై అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాసపల్లి రవి, ధనలక్ష్మి, జిల్లా అసోసియేట్ అధ్యక్షురాలు బండి శాంకరి డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ పీఆర్సీని 30శాతం ప్రకటిచగా, జిల్లాలోని ఏడుగురు మహిళా ఉపాధ్యాయులు సంబురాలు జరుపుకున్నారన్నారు. కొన్ని నకిలీ విద్యార్థి సంఘాల నాయకులు మహిళలు అని చూడకుండా దొంగ చాటుగా వీడియో తీసి సోషల్ మీడియాలో బడులకు గైర్హాజరై సంబురాలు జరుపుకుంటున్నారని అసత్య ప్రచారాలు చేశారని ఆరోపించారు.
టీచర్లు పాఠశాల సమయం అయిపోయాకే సాయంత్రం వేళ పీఆర్సీ సంబురాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నకిలీ విద్యార్థి సంఘాల దుష్ప్రచారాలను ఖండిస్తూ, మంగళవారం జిల్లా వ్యాప్తంగా 2వేల మంది ఉపాధ్యాయులు పీఆర్టీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారన్నారు. ఉపాధ్యాయులు చదువుపాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీకి పీఆర్టీయూ అనుబంధంగా లేదని తెలిపారు. నకిలీ విద్యార్థి సంఘాల అసత్య ప్రచారంపై ఇప్పటికే రామగుండం సీపీ సత్యనారాయణకు ఫిర్యాదు చేశామని చెప్పారు. డీఈవో, పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని లేకపోతే పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి సునీత, తాండూరు మండలాధ్యక్షురాలు జయప్రద, నస్పూర్ మండలాధ్యక్షుడు మహేశ్వర్, ప్రధాన కార్యదర్శి ప్రమోద్, హైమావతి, శ్రీదేవి పాల్గొన్నారు.
విచారణ జరిపించాలని డీఈవోకు వినతి
మంచిర్యాల అర్బన్, మార్చి 30 : మహిళా ఉపాధ్యాయులపై సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగిన అమానవీయ దాడిని ఖండిస్తూ, నకిలీ విద్యార్థి సంఘాలపై సమగ్ర విచారణ జరిపించాలని మంగళవారం పీఆర్టీ యూ టీఎస్ నాయకులు డీఈవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు.పీఆర్టీయూ టీఎస్ జిల్లాశాఖ అధ్యక్షు డు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి గోళి మనోహర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాసపల్లి రవి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు ధనలక్ష్మి, జిల్లా అసోసియేట్ అధ్యక్షురాలు బండి శాంకరి, రాష్ట్ర కార్యదర్శి సునీత, మంచిర్యాల మండలశాఖాధ్యక్షుడు మల్లేశ్, ప్రధాన కార్యదర్శి నాగరా జు, జయప్రద, హైమావతి, శ్రీదేవి, అనిత ఉన్నారు.