ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు సర్కారు అనేక చర్యలు తీసుకున్న నేపథ్యంలో, పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. పూర్తిస్థాయి వసతుల కల్పన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన వెరసి పాఠశాలలకు ప్రైవేట్ నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ఆదిలాబాద్ పట్టణంలో ఈ ఏడాది మరో 3 హైస్కూళ్లలో ఇంగ్లి ష్ మీడియం తరగతులను ఇందులో భాగంగానే ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వరంగ పాఠశాలలు కలిపి 1,432 కాగా.. ఇందులో ఈ యేడాది కొత్తగా 14,352 మంది, నిర్మల్ జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు కలిపి 840 బడులు కాగా.. ఇందులో ఈ సంవత్సరం 6,650మంది విద్యార్థులు కొత్తగా చేరారు.
ఉచిత విద్య, భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థులకు బోధన కొనసాగుతున్నది. దీనికి తోడు మధ్యాహ్నభోజనం, యూనిఫాం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కలిసి వస్తున్నది. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలు తల్లిదండ్రుల నమ్మకం పెరిగేందుకు కారణమయ్యాయి.
కళాశాలల్లోనూ పెరిగిన అడ్మిషన్లు..
జిల్లాలోని ఇంటర్మీడియెట్ కళాశాలల్లోనూ ఈ ఏడాది అడ్మిషన్లు భారీగా పెరిగాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, క్రీడలు, సాంస్కృతిక శిక్షణ వంటివి ప్రభుత్వ కళాశాలల్లో ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల ఒకేనల్ కోర్సుల్లోనూ శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలనే ఎంపిక చేసుకుంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వ కళాశాలల్లో సువిశాలమైన తరగతి గదులు, సైన్స్ ల్యాబ్లు, క్రీడామైదానాలు అందుబాటులో ఉన్నాయి. జనవరి నుంచి విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కళాశాలల్లో డిసెంబర్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు సబ్జెక్టుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ వారిని చదువుల్లో రాణించేలా చూస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చా..
నేను ప్రైవేట్ పాఠశాలలో చదివి గెజిటెడ్ నం.1 పాఠశాలలో చేరా. ఇక్కడ ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్జెక్టులో మాకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడూ అడిగి తెలుసుకోవాలని చెబుతున్నారు. సబ్జెక్టుల వారీగా అన్ని తరగతులు మంచిగ జరుగుతున్నాయి.
-అనుష్క, 8వ తరగతి ఇంగ్లిష్ మీడియం
చదువుతో పాటు ఆటల్లోనూ..
నేను ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. చదువుతో పటు ఆటల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ రోజూ ఆడిస్తున్నారు. నైపుణ్యమున్న ఉపాధ్యాయులు ప్రతి రోజు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెబుతున్నారు. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
అడ్మిషన్లు పెరిగాయి.
ప్రైవేట్ పాఠశాలల నుంచి ఈ ఏడాది అడ్మిషన్లు భారీగా పెరిగాయి. తరగతి గదులు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో అడ్మిషన్లు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇంకా తల్లిదండ్రులు అడ్మిషన్లు కావాలని వస్తున్నారు. వచ్చిన వారందరికీ ఉచితంగా పాఠ్యపు స్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. – డీ.నీలాదేవి, ప్రధానోపాధ్యాయురాలు
నాణ్యమైన విద్య అందించేలా చూస్తున్నాం..
ఈ ఏడాది ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో భారీగా అడ్మిషన్లు పెరిగాయి. ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల నుంచి వందలాది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.