ఇంద్రవెల్లి, డిసెంబర్ 16: ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. ఇంద్రవెల్లి పీహెచ్సీలో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ గురువారం కొవిడ్ టీకా రెండో డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా ఇప్పుడిప్పుడే మళ్లీ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యుడు శ్రీకాంత్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి కనక హనుమంత్రావ్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సుఫియాన్, పాల్గొన్నారు.
కొవిడ్ టీకా మొదటి డోస్ తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోస్ తీసుకోవాలని హెచ్ఈవో పవర్ రవీందర్ సూచించారు. గాదిగూడ మండలం మేడిగూడలో వ్యాక్సినేషన్ నిర్వహించారు. మొదటి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్ వేశామని తెలిపారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఏ బాపురావ్, ఏఎన్ఎం సుజాత,ఆశ కార్యకర్త దుర్పతాబాయి ఉన్నారు.
మండలంలోని ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. బేల, చప్రాల, సైద్పూర్ , సాంగ్వి, ఖార తదితర గ్రామాల్లో వైద్య సిబ్బంది గురువారం ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. టీకా ఆవశ్యకతపై బేల సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లలిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మాండగాడ సర్పచ్ ఇందూ మహేందర్ రావ్ అన్నారు. గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని సందర్శించారు. ఉమ్రి గ్రామంలో కూడా శిబిరం నిర్వహించి టీకాలు వేశారు. కార్యక్రమంలో వీవోఏలు ప్రహ్లాద్, ప్రకాశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మండలంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తూ టీకా వేస్తున్నారు. మండల కేంద్రంలో సర్పంచ్ జాదవ్ సునీత వ్యాక్సినేషన్ను పరిశీలించారు.