మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 13 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే రాష్ట్ర సర్కారు ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని సొఫీనగర్ తెలంగాణ గురుకుల పాఠశాల, కేజీబీవీలో బద్ధం భోజారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతి చదువుతున్న 1000 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని మే 11 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, డీఈవో రవీందర్, సెక్టోరియల్ అధికారి సలోమి కరుణ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గంగాశంకర్, కేజీబీవీ ఎస్వో సుజాత, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన
నిర్మల్ పట్టణంలోని ఈద్గాం శివాజీనగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ నల్ల పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హాజరయ్యారు. మంత్రికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్ల పోచమ్మ ఆలయాన్ని రూ.15లక్షలతో సుందరంగా నిర్మించామన్నారు. ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో ఆలయాలన్ని అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. పట్టణంలోని ప్రతి పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, కౌన్సిలర్ రమ్య విజయ్, నాయకులు సత్యనారాయణ, సోమేశ్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జడ్పీటీసీ జీవన్రెడ్డి, కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, గండ్రత్ రమణ పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
మామడ, ఫిబ్రవరి 13 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కిషన్రావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతినగర్ తండాలో నూతనంగా నిర్మించిన జగదాంబ సేవాలాల్ ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సజానిబాయి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పాకాల చంద్రశేఖర్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కాలగిరి గంగారెడ్డి, నాయకులు అల్లోల సురేందర్రెడ్డి, లింగారెడ్డి, మాన్సింగ్, బలరాం, రవీందర్ పాల్గొన్నారు.
మల్లన్న ఆలయంలో పూజలు
సోన్, ఫిబ్రవరి 13 : నిర్మల్ రూరల్ మండలం ముజ్గి మల్లన్న ఆలయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 16 నుంచి గ్రామంలో నిర్వహించనున్న మల్లన్న జాతర ఏర్పాట్లపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. 16న మేడారం జాతరకు వెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం చిట్యాల్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, సర్పంచ్ రమేశ్రెడ్డి, నాయకులు ఉన్నారు