ఇచ్చోడ(సిరికొండ), జనవరి 17 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నిర్వహించే నాగోబా జాతరకు సిరికొండ మండలానికి ప్రత్యేక అనుబంధముంది. పూర్వం నుంచి సిరికొండ మండల కేంద్రంలోని గుగ్గిళ్ల వంశీయు లు తయారు చేసిన మట్టి కుండలనే మెస్రం వంశీయులు తీసుకెళ్లి నాగ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నాగోబా జాతరను ప్రారంభిస్తారు. పూజా కార్యక్రమాలు, తాగునీరు, వంట కోసం వినియోగించే కుండలు సిరికొండ మండలకేంద్రానికి చెందిన గుగ్గిళ్ల వంశస్తులకు ఆ గౌరవం దక్కిం ది. గిరిజనుల ఆరాధ్యదైవం రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో సామక్క -సారక్క జాతర మొదటిది అయితే రెండో అతి పెద్ద గిరిజన జాతరగా నాగోబాకు గుర్తింపు ఉన్నది. ఈ నెల 21 నుంచి 28 వరకు జరగనున్న నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే పూజలకు సిరికొండలోనే కుండలు తయారవుతున్నాయి. నాగో బా పూజలకు రెండు రోజుల ముందుగా మెస్రం వంశీయులు సిరికొండకు చేరుకొని కుండలను పూజల కోసం తీసుకెళ్తారు. సిరికొండ కుండల వాటి ప్రాధాన్యత పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ..
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ ఒక చారిత్రక గ్రా మం. ఈ గ్రామంలో గతంలో సుమారు వెయ్యి కుమ్మరి కులస్తుల కుటుంబాలు నివాసం ఉండేవారు. వారు తయారు .చేసిన కుండలను బయట మార్కెట్లో విక్రయించి కుటుంబాలను పోషించుకునేవారు. ఇక్కడ నివసించే కుమ్మరి కుటుంబాల వారు గుగ్గిళ్ల వంశస్తులే .అయితే వారు కాలక్రమేణా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మరికొందరు ఈ వృత్తిలో స్ధిరపడ్డారు. దీంతో క్రమంగా వారి సంఖ్య తగ్గిపోయింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి వృత్తుల వారికి సబ్సిడీ రుణాలను అందిస్తూ వారికి కావాల్సిన సరుకులు, వస్తువులను పరికరాలను అందిస్తూ కుమ్మరి (చేతి వృత్తి )వారిని ప్రోత్సహించడంతో సిరికొండలో ఉన్న గుగ్గిళ్ల వంశీయులు తిరిగి స్వగ్రామాలకు చేరుకొని వారి వృత్తిని కొనసాగిస్తున్నారు.
మెస్రం వంశానికి చెందిన ఓ పెద్ద మనిషికి ఒక రోజు దేవత కలలోకి వచ్చి సిరికొండ గుగ్గిళ్ల వంశీయుల తయారు చేసిన కుండలనే తన పూజకు వాడాలని చెప్పిందని, అప్పటి నుంచి వారు ప్రత్యేకంగా తయారు చేసిన కుండలనే నాగోబా పూజకు వాడుతున్నామని మెస్రం వంశీయులు తెలిపారు. గిగ్గుళ్ల వంశానికి చెందిన రాజన్న తయారు చేసిన కుండలను అందించేవారు. ఆయన మరణానంతరం వంశీయుడు లస్మన్న, ఆయన చనిపోయిన అనంతరం ఆయన కుమారులుడు గుగ్గిళ్ల స్వామి కుండలను తయారు చేసి ప్రస్తుతం అందజేస్తున్నా రు. జాతరకు రెండు రోజుల ముందుగా మెస్రం వంశీయులు ఎడ్లబండిపై సిరికొండకు వచ్చి కుండలను తీసుకొని గంగకు బయలుదేరుతారు. ఈ కుండల ద్వారా గంగా జలాన్ని తీసుకువచ్చి కెస్లాపూర్కు గ్రామ సమీపంలోఉన్న ఒక మర్రి చెట్టుకింద ఉంచి అనంతరం పూజలు చేసి ఆ కొత్త కుం డలను ఆలయం వద్దకు తీసుకెళ్తారు. కుండల్లో తెచ్చిన గంగాజలంతో నాగోబా దేవతకు అభిషేకం చేస్తారు. అంతేకాదు ఈ కుండలో వండిన నైవేద్యాన్ని దేవతకు సమర్పిస్తారు.ఈ నీటినే పూజకు సైతం ఉపయోగిస్తారు
రెండు కాగులు (పెద్ద కుండలు ),16 బాణలు వీటికి 16 మూతలు , నీటి కుండలు 55 వీటితోనే గంగాజాలాన్ని తీసుకొచ్చి నాగదేవతకు అభిషేకం చేస్తారు. 45 కడుముంతలు వీటిని పూజలకు ఉపయోగిస్తారు. 150 మట్టితో తయారు చేసిన దీ పాలు వీటిని నాగోబా ఆలయం చుట్టూ దీపాలు వెలిగించేందుకు ఉపయోగిస్తారు. 8 రొట్టె పెంకలు వీటితో పూజకు వచ్చే మెస్రం వంశీయులు , వృద్ధులకు రొట్టెలు తయారు చేసి ప్రసాదంగా అం దజేస్తారు. గుగ్గిళ్ల వంశీయులకు స్వామికి ఆదివాసీ గిరిజనులు మెస్రం వంశీయులు ప్రత్యేక గుర్తింపునిస్తూ గౌరవిస్తారు. పూజల సమయంలో నాగో బా ఆలయానికి తీసుకువెళ్లి సన్మానిస్తారు .
కేస్లాపూర్ గ్రామం నుంచి ఎడ్లబండిలో కుండలు తీసుకువచ్చేందుకు సిరికొండకు బయలుదేరుతారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి రాత్రి ఆ కుండలను నాగోబా ఆలయం వెనుక భాగంలో భద్రపర్చి పెడుతారు. మరో రోజున మట్టి కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజా, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. రాత్రి మర్రి చెట్ల వద్ద సంప్రదాయ వాయిద్యాలు, కిక్రి వాయిస్తూ నాగోబా చరిత్ర, సిరికొండ మట్టి కుండల పవిత్రత గురించి మెస్రం వంశీయులు పాటల ద్వారా వివరిస్తారు.
యేటా నాగోబా దేవతకు ప్రత్యేకంగా కుండలు తయారు చేసి అందించడం అదృష్టంగా భావిస్తున్నాం . మెస్రం వంశీయులు నాగోబా దేవత కోరిక మేరకు తాము చేసిన కుండలనే ఉపయోగించి తమను గుర్తించడం గర్వంగా ఉంది.మెస్రం వంశీయులతోనే యేటా జాతరలో మా వంశీయులను ఘనంగా సన్మానిస్తారు. నాగోబా దేవత కూడా మమ్మల్ని చల్లగా చూస్తోంది.
-గుగ్గిళ్ల్ల స్వామి,కళ దంపతులు, కుమ్మరి ,
సిరికొండ మండలకేంద్రంలో గు గ్గిళ్ల వంశీయు లు తయారు చేసిన కుండలను నాగోబా పూజకు ఉపయోగిస్తాం. నెల రోజుల ముం దే కుండలను త యారు చేయాలని వారిని కోరు తాం. మా సంప్రదాయాల ప్రకారం తయారు చేసి ఇస్తారు. జాతరకు రెండు రోజుల ముందు ఎడ్లబండిపై వెళ్లి కుండలను తీసుకొని వారికి కొంత నగదు అందిస్తాం.గుగ్గిళ్ల వంశీయులను మా అతిథులుగా చూస్తాం. ఆ కుండల్లో గంగజలం తీసుకువచ్చి, నైవేద్యం వండి నాగదేవతకు సమర్పిస్తాం. అనంతరం నాగోబా జాతర ప్రారంభిస్తాం.
-మెస్రం వెంకట్రావు పటేల్, నాగోబా దేవత పీఠాధిపతి, మెస్రం కెస్లాపూర్