ఐటీడీఏ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్న కంపెనీ
మూడు నెలల్లో 120 క్వింటాళ్లు తయారీ.. రూ.26.40 లక్షల ఆదాయం
ఒక్కో సభ్యుడికి రూ.20వేలకుపైగా లాభం
కలిసొచ్చిన గిరిషోషణ్ పథకం
ఉట్నూర్, ఫిబ్రవరి 12 : ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్లి పట్టి పరిశ్రమ గిరిజనులకు వరంగా మారింది. ఒకవైపు చేతినిండా పనికల్పిస్తూనే.. మరోవైపు రక్తహీనతకు చెక్ పెట్టేందుకు దోహదపడుతున్నది. హైదరాబాద్లోని ఇక్రిశాట్ ద్వారా తర్ఫీదు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ మూడు నెలల వ్యవధిలో 120 క్వింటాళ్లు తయారు చేసి రూ.26.40 లక్షలు ఆర్జించారు. ప్రస్తుతం తయారు చేసిన వాటిని అంగన్వాడీలకు సరఫరా చేస్తుండగా.. ఆశ్రమ పాఠశాలలకు కూడా అందించనున్నారు. కాగా.. ఒక్కొక్కరికి రూ.20 వేలకుపైగా లభించగా, అడవిబిడ్డలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీలో రక్తహీనతకు చెక్ పెట్టడంతోపాటు గిరిజనులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్లిపట్టి పరిశ్రమ విజయవంతంగా నడుస్తున్నది. ఇప్పటి వరకు 120 క్వింటాళ్లు తయారు చేసి అంగన్వాడీలకు సరఫరా చేయగా రూ.26.40 లక్షల ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని సుమారు 297 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తుండగా.. ఆశ్రమ పాఠశాలలకు కూడా అందించనున్నారు. ప్రస్తుతం క్వింటాల్ పల్లిపట్టీలకు రూ.22 వేల చొప్పున విక్రయిస్తున్నారు.ఒక్కో సభ్యుడికి రూ.20 వేలకు పైగా ఆదాయం వచ్చిందని, కరోనా పరిస్థితుల నేపథ్యంలో వెనుకబడి ఉన్నామని, లేదంటే మంచి లాభాలు సాధించేవారమని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
శిక్షణ.. తయారీ..
ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 2020లో పల్లి(పుట్నాలు) పట్టీల పరిశ్రమ ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల నుంచి ఆత్రం లీలావతి, వరలక్ష్మి, తులసీ, మాధవ్రావు, ప్రమీళ, సంగీత, అనిత, అనురాధ, గంగా రాం, తిలక్తో కలిసి కమిటీని ఏర్పాటు చేసి పరిశ్రమను నిర్వహిస్తున్నారు. వీరికి ఉట్నూర్ ట్రైనింగ్ సెంటర్లో నెల పాటు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇక్రిశాట్ హైదరాబాద్ ద్వారా మూడు రోజుల తర్ఫీదు ఇచ్చి పరిశ్రమలో పని కల్పించారు. ఈ క్రమంలో కరోనా, లాక్డౌన్ కారణంగా కొద్ది రోజులకే మూసి వేశారు. 2021, అక్టోబర్లో తిరిగి క్రితం తెరిపించగా, ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్నది. యూనిట్ సభ్యులు రోజుకు రెండు షిఫ్టుల్లో పల్లి పట్టీలు తయారు చేస్తున్నారు. గిరిపోషన్ పథకంలో భాగంగా బాలింతలు, గర్భిణులు పల్లిపట్టీలు అందించేందుకు ఐటీడీఏ కూడా ఆర్డర్ ఇవ్వడం కలిసొస్తున్నది. ప్రస్తుతం చేతినిండా పనిదొరుకుతున్నది.
తయారీ ఇలా..
హైదరాబాద్ నుంచి నాణ్యమైన పల్లీలు, బెల్లం, చక్కెర, పుట్నాలు, నువ్వులు తీసుకొస్తారు. నేరుగా మిషన్ల ద్వారా వాటిని శుభ్రం చేసి.. వేడిచేసిన బెల్లంతో కలిపి పల్లి, పుట్నాల పట్టీలను తయారు చేస్తారు. అనంతరం మళ్లీ మిషన్ల ద్వారా ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.