నార్నూర్, జనవరి 1 : ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన మన ఊరు-మన బడి పథకం పనులు చివరిదశలో ఉన్నాయి. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని 48 గ్రామాల్లో 19 పాఠశాలలకు రూ.2కోట్లు మంజూరయ్యాయి. వాటిలో నార్నూర్, గుండాల మహార్గూడ, గుంజాల పాఠశాలలో నిర్మాణ పనులు పూర్తి కావడంతో పాటు రంగులు కూడా వేశారు. మిగిలిన 16 పాఠశాలల్లో నిర్మాణ పనులు చివరిదశలో కొనసాగుతున్నాయి. దాదాపు 94శాతం వరకు పనులు పూర్తయినట్లు ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.
తొలగనున్న ఇక్కట్లు….
నార్నూర్, గాదిగూడ మండలాల్లో మన ఊరు-మన బడి పథకం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎంపికైన పాఠశాలల్లో బెంచిలు, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు మరుగుదొడ్ల నిర్మాణాలు, తాగునీరు, ప్రహరీలు, డిజిటల్ తరగతులు, డైనింగ్హాల్, వంటగదులు, భవనాల మరమ్మతులతో పాటు ఆకర్షణీయమైన రంగులతో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సమస్యలు తీరనుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
విద్యార్థులకు తొలగిన ఇబ్బందులు
ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకం ద్వారా పాఠశాలల్లో మౌళిక వసతులు సమకూర్చడంతో విద్యార్థుల ఇబ్బందులు తొలిగాయి. ముఖ్యంగా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల, విద్యుత్ సమస్యలు తీరాయి. మా పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వందశాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం రంగులు వేశాం.
-రాజుకుమార్, ప్రధానోపాధ్యాయుడు, నార్నూర్
తల్లిదండ్రుల ఆసక్తి..
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు మౌళిక వసతులు సమకూరడంతో పాఠశాలలపై మరింత నమ్మకం పెరిగింది. ఈ పనులతో పాఠశాలలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు దీటుగా నడుస్తున్నాయి.
రాజ్పంగే రాజు, ఎస్ఎంసీ చైర్మన్, నార్నూర్
త్వరలో పూర్తి
నార్నూర్, గాదిగూడ మండలాల్లో మన ఊరు-మన బడి పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తవుతాయి. ఇప్పటికే మూడు పాఠశాలల్లో వందశాతం, మిగిలిన పాఠశాలల్లో 90 శాతంపైగా పనులు పూర్తయ్యాయి. తొలిమెట్టు కార్యక్రమంతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి.
-రాపెల్లి ఆశన్న, ఎంఈవో, ఉమ్మడి మండలం
గడువులోగా పనులు పూర్తి చేస్తాం
మన ఊరు-మన బడి పథకంలో నిధులు మంజూరైన పాఠశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. గుర్తించిన పనులు నాణ్యతతో చేపట్టి సాధ్యమైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం మూడు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మిగతా పాఠశాలలోని చేపట్టిన పనులు త్వరలోనే పూర్తి చేస్తాం.
-రాథోడ్ సునీల్, ఏఈ, ఐటీడీఏ