రెండు రోజుల పాటు పక్షులపై అధ్యయనం
అరుదైన జాతుల సందడి.. కెమెరాల్లో చిత్రీకరణ
అధికారులతో కలిసి కలియదిరిగిన పీసీసీఎఫ్ శోభ
తీపి జ్ఞాపకాలతో వెనుదిరిగిన పక్షి ప్రేమికులు
జన్నారం, ఫిబ్రవరి 13 :కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ (కేటీఆర్)ఫారెస్ట్లో నిర్వహించిన బర్డ్వాక్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు అటవీ ప్రాంతాల్లో కలియదిరుగుతూ పక్షులపై అధ్యయనం చేశారు. జలపాతాలు, కుంటల వద్ద కిలకిలరావాలతో సందడి చేసిన పిట్టలను తమ కెమెరాల్లో బంధించారు. రెండు రోజుల పాటు అటవీప్రాంతంలో విడిది చేసిన వారు తీపి జ్ఞాపకాలతో తిరుగుపయనమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ అధికారులతో కలిసి సందర్శించారు. త్వరలో మరోసారి బర్డ్ ఫెస్టివల్ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని,అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆమె తెలిపారు.
మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో నిర్వహించిన బర్డ్వాక్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. మొదటి రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు పక్షులపై అధ్యయనం చేశారు. మొదటి, రెండో రోజు అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో ఫారెస్ట్లో కలియదిరుగుతూ వివిధ రకాల పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. శనివారం రాత్రి బెసన్కుంట, కలప కుంట వద్ద విడిది చేశారు. ఆయాచోట్ల ఫైర్క్యాంప్ నిర్వహించారు. ఆదివారం ఉదయం అందరూ బెసన్కుంట వద్దకు చేరుకోగా, అక్కడ అల్పాహారం అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ, నిర్మల్, ఆదిలాబాద్ సీసీఎఫ్లు వినోద్కుమార్, రామలింగ, మంచిర్యాల, ఆసిఫాబాద్బాద్ డీఎఫ్వోలు శివానిడోంగ్రి, శాంతారాం, ఎఫ్డీవో మాధవరావు, రేంజ్ అధికారులు కామారెడ్డి నికిత, హఫీసొద్దీన్, రత్నాకర్రావుతో కలిసి జన్నారం రేంజ్లోని బెసన్కుంట, ఇందన్పెల్లి రేంజ్లోని మైసమ్మకుంట, గనిసెట్టికుంట, కలపకుంట ప్రాంతాల్లో పర్యటించారు. బైనాక్యులర్ ద్వారా వివిధ రకాల పక్షులను పరిశీలించారు. 300కుపైగా అరుదైన పక్షిజాతులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జన్నారంలోని అటవీశాఖ అతిథి గృహానికి అందరూ చేరుకున్నారు. అక్కడ భోజనం చేశారు. అనంతరం పక్షుల అధ్యయనానికి వచ్చిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
కేటీఆర్ దేశంలో నంబర్వన్గా నిలుస్తుంది
కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ (కేటీఆర్)ఫారెస్ట్ దేశంలోనే నంబర్వన్గా నిలుస్తుంది. ఈ ప్రాంతం వన్యప్రాణులతో పాటుగా అనేక పక్షి జాతులకు నిలయంగా మారింది. ఇక్కడ సంతతి పెరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఎక్కడా లేని విధంగా అడవుల్లో నీటి కుంటలు, గడ్డిక్షేత్రాలను పెంచుతున్నాం. త్వరలో బర్డ్ ఫెస్టివల్ను పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం. పక్షి ప్రేమికులు, పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.
– శోభ, పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్)
గొప్ప అనుభూతి
బెసన్కుంట ప్రాంతానికి వెళ్లినప్పుడు అనేక రకాల పక్షులు కనిపించాయి. వాటిని కెమెరాల్లో ఫొటో తీయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇక్కడ నేను ఊహించిన వాటికంటే ఎక్కువగానే ఉన్నాయి. గనిసెట్టికుంట,మైసమ్మ కుంట ప్రాంతాల్లో వలస పక్షుల విడిది కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. భవిష్యత్లో కవ్వాల్ అభయారణ్యం అనేక పక్షులతో పాటు జంతువులకు అనువైన ప్రాంతంగా మారుతుంది.
– విజయపాల్,సెంట్రల్ రైల్వేఉద్యోగి, ఢిల్లీ
కవ్వాల్ను మరింత అభివృద్ధి చేస్తాం
కవ్వాల్ను మరింత అభివృద్ధి చేస్తాం. వన్యప్రాణులతో పాటుగా పక్షులు, పెద్దపులులు సంచరించడానికి అనువుగా పనులు చేపడుతున్నాం. పెద్దపులుల ఆవాసానికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాం. వన్యప్రాణులు, పక్షులకు ఆహారం అందించడానికి గడ్డిక్షేత్రాలను విరివిగా పెంచుతున్నాం. రోజు రోజుకూ ఇక్కడ పక్షులు, వన్యప్రాణుల సంఖ్య పెరుగుతున్నది.