ముక్రా(కే)లో రూ.33కోట్లతో సంక్షేమ పథకాలు
ప్రతి ఇంటి ముందు ఇచ్చిన పథకాల వివరాలతో ఫ్లెక్సీ
సిరికొండ, ఫిబ్రవరి 13 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపిందంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్తులు కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. ఏడేళ్లుగా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద గ్రామానికి రూ.33 కోట్లు ఖర్చు చేసింది. గ్రామంలో 202 కుటుంబాలు ఉండగా 802 మంది జనాభా ఉంది. ప్రతి ఇంట్లో కనీసం ఆసరా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రుణమాఫీ లాంటి ఐదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి కుటుంబంలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ. 22లక్షల వరకు సర్కారు సాయం అందింది. ముక్రా(కే)లో ఇటీవల నిర్వహించిన గ్రామసభలో పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేశారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాలతో తమ ఉపాధి మెరుగుపడిందని, తమకు వచ్చిన పథకాల వివరాలను ఇంటిముందు రాయాలని గ్రామస్తులు కోరగా సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ సంక్షేమం..ప్రతి ఇంటికీ కేసీఆర్ అనే ఫ్లెక్సీలను అతికించారు. సంతోషంతో తమ ఇంటి ముందు అతికించిన ఫ్లెక్సీతో గ్రామస్తులు సెల్ఫీలు దిగి ఇతరులకు పంపిస్తున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సాయంతో గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు సర్పంచ్ మీనాక్షి తెలిపారు.