ఆసిఫాబాద్ టౌన్, జూలై 28 : కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో సభ్యత్వ నమోదు, కార్యకర్తల సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో కలిసి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరిం త బలోపేతం చేయాలన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వనజ, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ రావు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన కేంద్రం సందర్శన..
పట్టణంలోని బస్టాండ్ సమీపంలో కోనేరు ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టనున్న నిత్యాన్నదాన కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. వంటగది, డైనింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తూ ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో నిత్యాన్నదానం చేపట్టడం అభినందనీయమన్నారు. అన్నదానం వివరాలను మంత్రికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వివరించారు.వీరి వెంట జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, టీఆర్ఎస్ నాయకులు కట్టప్రసాద్, అధికారులు డీడీవో మణెమ్మ, ఏటీడబ్ల్యూవో నీలిమ, త దితరులు ఉన్నారు.