ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 14: దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్లకు పలువురు ఘన నివాళి ఘటించారు. పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్లకు సోమవారం పట్టణంలోని కార్గిల్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, కెప్టెన్ మాజిద్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించడం గొప్పవిషయమన్నారు. దేశసేవలో నేటి యువత ముందుండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పుల్వామా దాడిలో అమరులైన వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ ఖత్రీ, ప్రధాన కార్యదర్శి మాధవ్, రవీందర్, పడకంటి సూర్యకాంత్, సతీశ్, సాయి కృష్ణ పాల్గొన్నారు.
కొవ్వొత్తుల ప్రదర్శన..
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 14: ఆదిలాబాద్ పట్టణంలోని కార్గిల్ పార్క్ వద్ద సోమవారం రాత్రి అమరజవాన్లకు కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళి అర్పించారు. జాతికోసం వారు చేసిన త్యాగాలు గుర్తుచేసుకున్నారు. యువజనసంఘాల నాయకులు ఊరే గణేశ్, రంగినేని శ్రీనివాస్, శశికళ, బాలశంకర్, పసుపుల రాజు, ఆదిత్య ఖండేష్కర్, వాగ్మారే ప్రశాంత్, బండారు దేవన్న, శివ, ప్రశాంత్, శంకర్ పాల్గొన్నారు.