శ్రీకృష్ణుడి ప్రేమ ఉంటే చాలు మరే భోగాలూ అక్కర్లేదు.. అంటారు ఆయన ప్రియసఖులు. హరేకృష్ణ మంత్రంలోనే అష్ట ఐశ్వర్యాలూ కొలువై ఉంటాయంటారు ఆయన భక్తులు. కృష్ణమూర్తి దివ్య సుందర రూపాన్ని ప్రేమిస్తూ, ధ్యానిస్తూ అందులోనే జీవిత పరమార్థాన్ని వెతుక్కున్న అపర కృష్ణ ప్రేమికులూ చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకరు హరియాణా సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతీ అరోరా. పదవులూ, పలుకుబడులూ, అధికారాలూ, అందలాల కన్నా శ్రీకృష్ణుడి సేవే ఎక్కువంటారామె. అందుకే గత డిసెంబరులో ఉద్యోగానికి రాజీనామా చేసి బృందావనానికి వెళ్లిపోయారు. ఐపీఎస్ కొలువు విడిచిపెట్టే నాటికి ఆమెకు ఇంకా పదేండ్ల సర్వీసు ఉంది. ఆ సమయంలో హరియాణాలో అంబాలా రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా ఉన్నారు. 23 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలు బాంబు పేలుళ్లలాంటి కీలక కేసుల దర్యాప్తులకు బాధ్యత వహించారు.
విధినిర్వహణలో చూపిన ప్రతిభకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డునూ అందుకున్నారు. అయితే హరియాణాకు బదిలీ అయి వచ్చిన తర్వాతే ‘హరి’ తన జీవితంలోకి ప్రవేశించాడంటారామె. ఒక సాధువు ఉపదేశంతో జీవితానికి అసలైన పరమార్థాన్ని కనుగొన్నాననీ, అది కృష్ణభక్తిలోనే ఉందనీ అంటారు భారతి. అందుకే గురునానక్, తులసీదాస్, కబీర్దాస్, చైతన్య మహా ప్రభువుల మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నానని చెబుతారు. తన పదవీ విరమణ రోజు ఆఫీసుకు కృష్ణభక్తులు ధరించే తరహా కాషాయ దుస్తుల్లోహాజరయ్యారు. ఇప్పుడు ఆమె జగమంతా జగన్నాథుడే!