పిల్లలతో ఎక్కడికైనా వెళ్లడమంటే మామూలు విషయం కాదు. రెండ్రోజుల ప్రయాణానికైనా, వారంరోజుల ముందు నుంచే ఇంట్లో హంగామా మొదలవుతుంది. తీరా బయలుదేరుతుంటే, ఆయనకు ఆఫీసు నుంచి ఫోన్కాల్ .. ట్రిప్ క్యాన్సిల్! ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతున్నది ముంబయికి చెందిన ‘డలాడో’ అనే ట్రావెల్ ఏజెన్సీ. ఈ సంస్థను స్థాపించిన నటాషా పింపుల్ అనుభవంలోంచి పుట్టుకొచ్చిన ఐడియా ఇది. “గృహిణులు భర్త తోడు లేకుండా పిల్లలను టూర్లకు తీసుకెళ్లేందుకు వెనుకడుగు వేస్తారు. మా కంపెనీ ముఖ్యంగా అలాంటి వాళ్లకోసమే ఏర్పాటైంది. మేం పిల్లలకు ఉపయోగపడే ప్రదేశాలకే ట్రిప్స్ వేస్తాం. దేశ సంస్కృతిని, చరిత్రను తెలియజెప్పే కట్టడాలకు, వినోదాన్ని పంచే జూలాజికల్ గార్డెన్లకూ తీసుకెళ్తుంటాం. ఒక్కో ట్రిప్లో పిల్లలతో కలిపి 10-20 మంది ఉండేలా చూసుకుంటాం’ అని చెబుతున్నారు డలాడో స్థాపకురాలు నటాషా పింపుల్. కరోనా తర్వాత, ఇప్పుడిప్పుడే ఆమె వ్యాపారం పుంజుకుంటున్నదట.