రంగురంగుల అద్దాలు, అల్యూమినియం పట్టీలు, పాలరాతి సొబగులు.. ఆధునిక భవనాల అందాలన్నీ కాగితం పూల చందమే. ఎక్కడా సహజత్వం ఉండదు. ఇందుకు భిన్నంగా ఉంటాయి ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి డిజైన్లు. ఆ శైలిలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. పల్లె వాతావరణపు మేళవింపుకనిపిస్తుంది. జిల్లాల్లో కొత్తగా నిర్మిస్తున్న పరిపాలన భవన సముదాయాలే అందుకు నిదర్శనం.
‘పాలన’ భవనమా..
ఉషారెడ్డి ఆర్కిటెక్చర్లో పంచభూతాలకూ ప్రాధాన్యం ఉంటుంది. ఆ ఆవరణలో కాలుపెడితే కాంక్రీట్ గోడల మధ్య నడుస్తున్నట్టు ఉండదు. పచ్చని లోగిలిలో ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ‘స్థానిక’ సౌందర్యమే ఆమెకు అరుదైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది, జిల్లాల్లో పరిపాలన భవన సముదాయాల నిర్మాణానికి డిజైన్ అందించే అవకాశం దక్కింది. భువనగిరి యాదాద్రి జిల్లాలోని చాడ ఉషారెడ్డి స్వగ్రామం. తల్లిదండ్రులు సీఎన్ రెడ్డి, సుజాత. ఆ దంపతులకు నలుగురు అమ్మాయిలు. ఉష పెద్ద కూతురు. సీఎన్ రెడ్డి రైల్వేలో చీఫ్ ఇంజినీర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఉష పాఠశాల విద్యాభ్యాసం డార్జిలింగ్లో జరిగింది. హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఫైన్ ఆర్ట్స్లో పట్టా అందుకొన్నారు. వివాహం తర్వాత అమెరికా వెళ్లిపోయారు. అక్కడే మాస్టర్స్ చేశారు. కొంతకాలానికి, హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఆర్కిటెక్ట్గా ఇక్కడే వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనేక భవనాలకు నమూనాలు అందించారు. ఆమె పిల్లలు మాత్రం అమెరికాలోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం, భర్త రఘువీర్ రెడ్డితో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నారు ఉష.
కేరళ శైలి ప్రభావం..
ఉషారెడ్డి ఒకసారి కేరళలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి గృహ నిర్మాణ శైలిని గమనించారు. ఆ నమూనాల గురించి లోతైన అధ్యయనం చేశారు. ఆర్కిటెక్ట్ లారి బ్రేకర్ కేరళ సంప్రదాయ నిర్మాణ పద్ధతులను మేళవిస్తూ ఆధునిక భవనాలకు ప్రాణం పోసిన తీరు ఆమెకు నచ్చింది. ఆయన స్ఫూర్తితో ఆర్కిటెక్చర్లో తెలంగాణ స్థానికతను జోడించాలని తీర్మానించుకొన్నారు. మన పల్లెల్లో.. వందేండ్ల నాటి ఛత్రిశాల భవంతులను ఊహించుకోండి. ఇంటిచుట్టూ మట్టిగోడ, ఆ గోడలపై తీగజాతి మొక్కలు, లోపలి భాగంలో పూలమొక్కలు. ఆరుబయట పెద్ద అరుగులు, లోపలి భాగంలో నాలుగువైపులా గదులు. మధ్యలో విశాలమైన వసారా. పుష్కలమైన వెలుతురు, ఎక్కడ కూర్చున్నా చల్లగా ఒంటిని తాకే గాలి. ఎండకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండటం ఆ నిర్మాణ శైలి ప్రత్యేకత. ఆ నమూనానే ఉషారెడ్డి స్ఫూర్తిగా తీసుకొన్నారు. ఎలాంటి కృత్రిమ అలంకరణలకూ
ప్రాధాన్యం ఇవ్వరామె. రంగురంగుల అద్దాలు, ఖరీదైన మార్బుల్స్ అస్సలు ఇష్టపడరు. ఉన్న స్థలంలోనే, ప్రకృతి వనరులతో భవనాలకు మెరుగులు దిద్దుతారు. అడ్డుగా ఉన్న చెట్లను, బండరాళ్లను తొలగించకుండా డిజైన్లలో అంతర్భాగం చేస్తారు.
అనుకోని అవకాశం
ఉషారెడ్డి గతంలో పలు జిల్లాల్లో మహిళా సమాఖ్య భవనాలకు డిజైన్లు రూపొందించారు. ఆ భవనాల గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, స్వయంగా ఉషారెడ్డిని పిలిపించి మాట్లాడారు. కానీ, నూతన కలెక్టరేట్ల డిజైనింగ్ బాధ్యతను ఆమెకు అప్పగిస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఉషారెడ్డి కూడా నమ్మలేకపోయారు. ఆ బాధ్యతను ఒక సవాలుగా స్వీకరించారామె. 68 ఏండ్ల వయసులోనూ రేయింబవళ్లు కష్టించి నమూనాలను తయారు చేశారు. హెలిప్యాడ్ నుంచి ఆరుబయట ఆడిటోరియం వరకూ.. సకల సౌకర్యాలూ ఉండేలా జాగ్రత్తపడ్డారు. అధికారుల బాధ్యతలనూ, సామాన్యుల అవసరాలనూ దృష్టిలో పెట్టుకొన్నారు. ఆ డిజైన్ను ముఖ్యమంత్రి ఎలాంటి మార్పులూ చేయకుండానే ఆమోదించారు. ‘వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో మా నాన్నే నాకు స్ఫూర్తి. ఆడబిడ్డలని ఎప్పుడూ చిన్నచూపు చూడలె. మగవాళ్లతో సమానంగా పెంచిండు. ఆయన ఇచ్చిన ధైర్యం వల్లే ఇంత పెద్ద బాధ్యతను పూర్తి చేయగలిగాను’ అంటారామె.
ఆత్మీయ స్పర్శ
తెలంగాణలోని నూతన కలెక్టరేట్ భవనాల్లో అంతర్లీనంగా ఓ ఆత్మీయ స్పర్శ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలంటే.. రాజసం ఉట్టిపడుతూ ఉంటాయి. ‘నువ్వెంత? నీ స్థాయి ఏమిటి?’ అన్నట్టు సామాన్యులను బెదరగొడుతుంటాయి. అందుకు భిన్నంగా కనిపిస్తాయి, ఉషారెడ్డి ప్రాణం పోసిన నూతన కార్యాలయ సముదాయాలు. సందర్శకులు చిన్న అసౌకర్యానికి కూడా గురికాకుండా ఆ భౌతిక నిర్మాణాలకు ఓ ఆత్మనిచ్చారు. ‘36 ఏండ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో ఎన్నో భవనాలకు ప్రాణం పోసినా, కలెక్టరేట్ల రూపకల్పన మాత్రం మరచిపోలేని మధురానుభూతి’ అంటారు ఉషారెడ్డి. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉషారెడ్డి చురుగ్గా పాల్గొంటారు. స్వచ్ఛంద సంస్థలు దాతల సాయంతో నిర్మించే
భవనాలకు ఉచితంగా ఆర్కిటెక్చర్ సేవలు అందిస్తారు. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తుంటారు.
కేసీఆర్ ఆలోచనలకు రూపం
కలెక్టరేట్ల డిజైనింగ్ బాధ్యతను అప్పగిస్తూ సీఎం కేసీఆర్గారు ఒకే మాట చెప్పారు. ‘తెలంగాణ సంస్కృతికి దర్పణం పట్టే బిల్డింగ్ను చూసొచ్చామని జనం గర్వంగా చెప్పుకొనేలా ఉండాలి’ అన్నారు. ఆ మాట నేను నిలబెట్టుకొన్నా. ఇంత గొప్ప అవకాశమిచ్చిన ముఖ్య
మంత్రిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఉషారెడ్డి
–మ్యాకం రవికుమార్