టాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. తెలుగు కథానాయకులు పాన్ ఇండియా స్టార్లుగా వెలిగిపోతున్నారు.తెలుగు దర్శకులకు బీటౌన్లో రెడ్కార్పెట్ స్వాగతం లభిస్తున్నది.అదేజోరులో టాలీవుడ్ ఒంపుసొంపులు ఇప్పుడు బాలీవుడ్కు ఇంపుగొలుపుతున్నాయి. ఏండ్లుగా తెలుగువారిని అలరించిన మేటి తారలు హిందీ సినిమాల్లో తళుక్కుమంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలు అడక్కుండానే వచ్చి వరిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత, రశ్మిక, తమన్నా, నయనతార ఇప్పుడు బాలీవుడ్ సెలెబ్రిటీ హోదాను అందుకుంటున్నారు.
ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే.. టాలీవుడ్లో పుట్టి బాలీవుడ్ను ఊపేసిన తారలు ఎందరో కని
పిస్తారు. టాకీలు మొదలైన తొలినాళ్ల నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉన్నది. 1950లో ‘సుందరాంగ మరువగలేనోయ్ రావేలా..’ అంటూ తన అందచందాలతో అలరించిన వైజయంతీమాల తర్వాత హిందీ చిత్రరంగంలో తిరుగులేని తారగా ఎదిగింది. ‘రోజులు మారాయి’ సినిమాలో ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..’ పాటలో తరాలు మారినా గుర్తుండిపోయే అభినయాన్ని ప్రదర్శించిన నటి వహీదా రెహమాన్. తర్వాత ఒకట్రెండు తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించినా.. బాలీవుడ్కేగి ఒక ట్రెండ్ సృష్టించింది. అలనాటి జమున, గీతాంజలి.. వారి సమకాలీన నటీమణులెందరో హిందీ సినిమాల్లో మెప్పించారు. శ్రీదేవి, జయప్రద దక్షిణాది చిత్రాల్లో బిజీగా ఉంటూనే, హిందీ సినిమాల్లో తమదైన ముద్రవేశారు. తర్వాత చాలారోజులు టాలీవుడ్ భామలు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయలేదు. బాలీవుడ్ కథా
నాయికలే తరచూ తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ వచ్చారు. పాత సంప్రదాయానికి తెరతీస్తూ బాలీ
వుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ తరం నటీమణులు.
చూపే సింగారమాయెనే..
‘పుష్ప’ సినిమా అల్లు అర్జున్ గ్రాఫ్ ఎంతగా పెంచిందో.. అందులో శ్రీవల్లిగా నటించిన రశ్మిక మందన్నకూ అంతే పేరు తెచ్చింది. ఆరేండ్ల కిందట సినిమాల్లోకి వచ్చిన ఈ కూర్గ్ బ్యూటీకి ఇప్పుడు గోల్డెన్ టైమ్ నడుస్తున్నది. ఇన్నాళ్లూ దక్షిణాదికే పరిమితమైన రశ్మిక ‘నా సామి..రారా సామి..’ స్టెప్పుతో హిందీ జనాలనూ ఉర్రూతలూగించింది. దీంతో పెద్దగా ప్రయత్నం చేయకుండానే బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసింది. హిందీలో మొదటి అవకాశం బిగ్ బి అమితాబ్బచ్చన్ సినిమా కావడం ఆమె డిమాండ్ను తెలియజేస్తున్నది. ‘గుడ్ బై’ సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన రశ్మిక ‘ఇక మీదట తరచూ హిందీ సినిమాల్లో కనిపిస్తా’ అని ప్రకటించింది కూడా! ఆ చిత్రంలో అమితాబ్ కూతురిగా పరిణతి కలిగిన నటన ప్రదర్శించి అందరి ప్రశంసలూ అందుకున్నది. బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమా విజయవంతం కావడంతో బాలీవుడ్ దర్శక, నిర్మాతలు రశ్మిక కాల్షీట్లు హాట్ కేకుల్లా కొనేస్తున్నారు. తాజాగా హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్నది. సిద్ధార్థ్ మల్హోత్రతో ‘మిషన్ మజ్ను’, రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నది. మరోవైపు పుష్ప 2తోపాటు మరిన్ని తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉందీ కన్నడ కస్తూరి.
సడెన్ సర్ప్రైజ్
‘ఏ మాయ చేసావే’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సమంత పుష్కర కాలంగా మాయ చేస్తూనే ఉంది. అందం, అభినయంతో టాప్ హీరోయిన్గా నిలిచింది. ఈగ, రంగస్థలం, యూ టర్న్, ఓ బేబీ వంటి సినిమాలు ఆమెను అగ్రతారగా నిలబెట్టాయి. పెండ్లి తర్వాత జరిగిన పరిణామాలు కొంత కుంగదీసినా నటిగా వెనక్కి తగ్గలేదు. దక్షిణాదిలో టాప్గేర్లో ఉన్న సమంతను ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ చేసింది మాత్రం ‘ఫ్యామిలీమ్యాన్-2’ వెబ్సిరీసే. ఎల్టీటీఈ సానుభూతిపరురాలిగా ఆమె అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు సమంత ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా అమాంతం పెరిగింది. తాజాగా
వరుణ్ధావన్తో ‘సిటాడెల్’ చిత్రంలో నటిస్తున్నది. దీంతోపాటు ఆమె నటించిన బృందావనం, సన్నాఫ్ సత్యమూర్తి తదితర సినిమాల డబ్బింగ్ వెర్షన్లు ప్రైవేట్ చానల్స్లో ప్రసారం అవుతుండటం కూడా సమంతను హిందీ ప్రేక్షకులకు చేరువ చేసింది.
బబ్లీ తమన్నా..
మిల్కీబ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ‘హ్యాపీడేస్’ ఎంజాయ్ చేస్తున్నది. వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపిన తమన్నా జోరు ఇటీవల తగ్గిన మాట వాస్తవం. అయితే, తనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నది. ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ ‘బాహు
బలి’లో అవంతిక పాత్రతో ఆల్ ఇండియా కథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే, బాహుబలి సక్సెస్ను బాలీవుడ్లో క్యాష్ చేసుకోలేకపోయింది. హిమ్మత్వాలా, హమ్శకల్ సినిమాలతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అంతగా కలిసిరాకపోవడంతో మళ్లీ దక్షిణాదికే పరిమితమైంది. తాజాగా ‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. మరిన్ని అవకాశాలు కూడా ఆమె తలుపుతడుతున్నాయి.
నయా జర్నీ
బాపు ‘శ్రీరామరాజ్యం’ తర్వాత నయనతార సినిమాలకు స్వస్తి చెబుతుందన్న వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. చిన్న గ్యాప్ తీసుకున్న నయన్.. మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయింది. గుర్తుండిపోయే పాత్రలెన్నో చేసింది. ఇటీవల ‘గాడ్ఫాదర్’లో చిరంజీవి చెల్లెలుగా ప్రేక్షకులను మెప్పించింది. సుదీర్ఘ కెరీర్లో అన్ని దక్షిణాది భాషల్లో నటించిన నయనతార హిందీవైపు కన్నెత్తి చూడలేదు. సినిమాల్లోకి వచ్చిన దాదాపు 19 ఏండ్ల తర్వాత బాలీవుడ్లో కొత్త జర్నీకి శ్రీకారం చుట్టింది నయన్. షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ చిత్రంలో నయనతార నటిస్తున్నది. హిందీలో మొదటి సినిమాతోనే బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారుక్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని అంటున్నది ఈ బ్యూటీ. ఇటీవలే సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లయిన నయనతార బాలీవుడ్లో కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తుందో, లేదో వేచిచూడాలి.