విస్తరాకులో భోజనం చేస్తే ఆ మజానే వేరు. అన్నానికి ఎక్కడ లేని రుచి వస్తుంది. కారణం ఏమైతేనేం, విస్త్తరాకుల వాడకం క్రమంగా తగ్గింది. మోదుగాకుల స్థానంలో పేపర్ ప్లేట్ల వాడకం పెరిగింది. కరోనా కష్టాల తర్వాత, జనానికి మళ్లీ ఆరోగ్యం విలువ తెలిసొచ్చింది. దీంతో విస్తరికి గిరాకీ అధికమైంది. ఈ పరిణామం మెదక్ మండలంలోని మక్త భూపతిపూర్ మహిళలకు కలిసొచ్చింది.
మక్త భూపతిపూర్ గ్రామం.. మెదక్ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో చాలామంది మహిళలకు విస్త్తరాకులు కుట్టడమే ఉపాధి మార్గం. తెల్లవారుజామునే అటవీ ప్రాంతానికి వెళ్లి మోదుగు ఆకులు సేకరించుకొని వస్తారు. ఒక్కో ఆకునూ కలుపుతూ దండలాగా చేస్తారు. ఆ దండను నీటిలో ఉంచుతారు. పచ్చిగా తయారైన ఆకులతో విస్తళ్లు తయారు చేస్తారు. సాయంత్రంలోపు ఒక్కో మహిళా రెండు నుంచి ఐదు కట్టల వరకూ కుడతారు. వాటిని మెదక్తో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సరఫరా చేస్తారు. ‘రోజుకు రెండు విస్త్తరాకుల కట్టలు తయారు చేస్తా. గతంలో రోజుకు ఐదు కట్టల వరకూ అమ్మేదాన్ని.. మధ్యలో ప్లాస్టిక్, పేపర్ ప్లేట్స్ రావడంతో ఎవరూ విస్త్తరాకులను కొనేవారు కాదు. ఇప్పుడు మళ్లీ వ్యాపారం పెరిగింది’ అంటారు జియ్యరి లక్ష్మి, మంజుల.
మోదుగు ఆకుల్లో భోజనం చేయడం వల్ల పేగుల్లోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేదం చెబుతున్నది. ఈ ఆకుకు ఓ ప్రత్యేకత ఉంది. మోదుగు ఆకును ఏ జంతువూ ముట్టదు. ఎంగిలి కాని ఆకు కాబట్టే అంత ప్రాధాన్యం. ఎంత పెరిగినా మోదుగు చెట్టు కొమ్మకు మూడే ఆకులు ఉంటాయి. వాడిన తర్వాత ఇవి, భూమిలో మురిగిపోయి ఎరువుగా మారుతాయి. కాబట్టి, పర్యావరణానికీ ఇబ్బంది ఉండదు. మన భోజనం.. ప్రకృతి పొట్ట కొట్టకూడదంటే.. విస్తరాకు భోజనమే ఉత్తమం.
–చెవిటి అశోక్