ఒకరు లెక్కల్లో టాప్. ఒకరు డేటా ఎనాలిసిస్లో షేర్. తన బుర్రనే పెట్టుబడిగా పెట్టి ‘భానూజ్’ అనే గణిత శిక్షణ సంస్థను స్థాపించాడు నీలకంఠ భాను. గణాంకాలతో కార్పొరేట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేందుకు ‘అట్లాన్’కు ప్రాణం పోశాడు వరుణ్ బంక. ఇద్దరి వయసూ ముప్పైలోపే. ఇద్దరి ప్రతిభకూ నూటికి నూరు మార్కులు వేసింది ఫోర్బ్స్!
Data is the world’s most valuable resource.
వ్యవస్థ మొత్తం డేటా చుట్టే తిరుగుతున్నది. ఒక ప్రాజెక్ట్కు, పథకానికి డేటా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా ఓ స్టాక్ సెంటర్ ఉండాలి. ‘అట్లాన్’ అలాంటి స్టార్టపే. దీనిని అంతర్జాతీయ మార్కెట్లో అగ్రగామిగా నిలబెట్టాడు ఓ హైదరాబాదీ. తాజాగా ఫోర్బ్స్ లిస్ట్కు ఎక్కి బెస్ట్ ఆంత్రప్రెన్యూర్ అనిపించుకున్న వరుణ్ బంక సక్సెస్ స్టోరీ ఇది..
వరుణ్ బంక.. అచ్చమైన హైదరాబాదీ. మూడేండ్ల క్రితం అట్లాన్ అనే డేటా కంపెనీని స్థాపించాడు. గణాంకాల సేకరణలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్న స్టార్టప్ ఇది. డేటా అంటే మొబైల్ ఫోన్లో వాడే ఇంటర్నెట్ డేటా కాదు. అదొక సమాచారం. ఒక వనరు. ఆర్థిక వృద్ధికి కొలమానం. డేటా విశ్లేషణలో అట్లాన్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. దీనిలో రతన్టాటా కూడా పెట్టుబడులు పెట్టారు. ప్రకల్ప శంకర్ సహ-భాగస్వామిగా ఉన్నారు. వరుణ్, ప్రకల్ప శంకర్.. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. క్యాంపస్ నుంచి బయటికి రాగానే ‘సోషల్కాప్స్’ అనే స్టార్టప్ను స్థాపించాడు. దాని ద్వారా దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అవసరమైన ‘సంక్షేమ’ గణాంకాలు సమకూర్చాడు. కేంద్ర ప్రభుత్వంతోనూ కలిపి పనిచేస్తున్నది ‘సోషల్ కాప్స్’. కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ అయ్యే ఎల్పీజీ, పెట్రోలియం, సహజవాయువుల గణాంకాలను ఈ సంస్థే విశ్లేషిస్తుంది. ‘సోషల్ కాప్స్’ అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రిసోర్స్ పర్సన్స్ ద్వారా విశ్వసనీయమైన డేటాను సేకరిస్తుంది. ఆ గణాంకాల ఆధారంగానే.. ఏ ప్రాంతంలో ఎలాంటి వ్యాధుల ముప్పు పొంచి ఉందో విశ్లేషిస్తుంది. పోషకాహార అవసరాలనూ అంచనా వేస్తుంది. అలా డేటా ఎనలైజర్గా అనుభవం సంపాదించాడు వరుణ్. దాదాపు పదమూడు దేశాలకు సమాచార సహకార వేదికగా పనిచేస్తున్నది ‘అట్లాన్’. ఇండియా నుంచి ప్రారంభమైన అట్లాన్ ప్రస్థానం అమెరికా, సింగపూర్, ఫిలిప్పీన్స్, నైజీరియా వంటి దేశాలకు విస్తరించింది. యూనిలీవర్, పేటీఎమ్, డెలివరీ, పోస్ట్మాన్.. తదితర దిగ్గజాలకు డేటా సేవలన్నీ అట్లాన్ నుంచే అందుతాయి. గత ఏడాది అట్లాన్ కస్టమర్ల విషయంలోనే కాదు, ఆదాయంలోనూ పది రెట్ల వృద్ధిని సాధించింది. ఫోర్బ్స్-30 జాబితాలో స్థానం సంపాదించడం గొప్ప ఆనందాన్ని ఇస్తున్నదంటున్నాడు వరుణ్. ‘నా ప్రతి విజయం వెనుకా నా టీమ్ ఉంది. నా మిత్రురాలు ప్రకల్ప పాత్రా ఉంది’ అంటాడు వరుణ్.
ప్రపంచంలోనే అతి వేగవంతమైన కాలిక్యులేటర్ పేరు చెప్పమని అడిగితే.. ఏ బహుళజాతి సంస్థ కంప్యూటర్ పేరో చెబుతారు. మరి, ‘అత్యంత శక్తిమంతమైన హ్యూమన్ కంప్యూటర్?’ అని అడిగితే నీళ్లు నములుతారు. ‘నీలకంఠ భాను’ ఆ ప్రశ్నకు తిరుగులేని జవాబు. తాజాగా తను ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించాడు. పిల్లల్లోని మ్యాథ్స్ ఫోబియాను పోగొట్టడమే తన లక్ష్యమని అంటున్నాడు..
“ప్రతి విద్యార్థిలో ఒక శ్రీనివాస రామానుజన్ ఉన్నాడు. ప్రతి ఆడపిల్లలో శకుంతలాదేవి అంశ ఉండి తీరుతుంది. కానీ, లెక్కల పట్ల ఉన్న భయమే ఆ చిన్నారుల ప్రతిభను కాలమేఘంలా కప్పేస్తున్నది. నేను లెక్కల టీచర్గా కెరీర్ ప్రారంభించిన రోజు.. ఇలా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కుతానని ఊహించలేదు. అత్యంత వేగవంతమైన హ్యూమన్ కంప్యూటర్ హోదా లభిస్తుందనీ కలగనలేదు. ఇప్పటికే లెక్కలలో లెక్కలేనన్ని విజయాలు సాధించిన వ్యక్తులే నాకు స్ఫూర్తి. పుట్టుకతోనే ఎవరూ గణిత మేధావులు కారు. సాధనతోనే ఆ స్థాయికి చేరుకున్నారు. పదమూడో ఏట నేను.. లెక్కలతో ప్రేమలో పడ్డాను. మెంటల్ మ్యాథమేటిక్స్ సాధకుడిగా మారాను. ఎలాంటి పరికరాల సాయం లేకుండానే.. కాగితం, కలం పట్టుకోకుండానే ఎంత చిక్కు లెక్కనైనా చేయడమే.. మెంటల్ మ్యాథమేటిక్స్. పదిహేడో ఏట.. లెక్కల గురువు అవతారం ఎత్తాను. మరింత సులభంగా గణితాన్ని ఎలా బోధించాలి? అన్న కోణంలో ప్రయోగాలు మొదలుపెట్టాను. ప్రపంచమంతా పర్యటించాను. ఐదువందల గణిత ప్రదర్శనలు ఇచ్చాను.
‘భానూజ్’ పేరుతో గణిత శిక్షణ సంస్థ ప్రారంభించాను. పిల్లల్లో గూడుకట్టుకున్న లెక్కల భయాన్ని పోగొట్టడమే నా లక్ష్యం. నేను పుట్టిపెరిగింది హైదరాబాద్లోనే. మాది వ్యాపార కుటుంబం. ‘భానూజ్’ను ఓ గొప్ప విద్యా వ్యాపార సంస్థగా తీఫోర్బ్స్-పోరగాళ్లుర్చిదిద్దాల్సి ఉంది. నా సంస్థ నాకంటే గొప్పగా ఎదగాలన్నది నా కల. అప్పుడే, ప్రపంచానికి మనం ఏమిటన్నది తెలుస్తుంది”.