2023 Year Ender | ఈ ఏడాది.. ఆమెదే! అన్నిటా మిన్నగా నిలిచింది అతివే!! తాను ఇంటికి మాత్రమే పరిమితం కాదనీ… అనితర సాధ్యాలకు దిక్సూచిననీ మహిళ నిరూపించుకుంది. సంపదలో మహాలక్ష్మి ఆవిడే! భారతీయ రైల్వేను నడుపుతున్నదీ ఆవిడే!! ఒకరు చిరుధాన్యాలకు చిరునామాగా నిలిస్తే… ఇంకొకరు సమాజ సేవకే జీవితాన్ని అంకితమిచ్చారు. ఒకరు సివంగిలా కదనరంగంలో కాలుదువ్వితే.. వేరొకరు ఖడ్గమృగాలకు రక్షణగా నిలుస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ స్త్రీ శక్తి ప్రకటితమైన సంవత్సరంగా 2023 నిలిచిపోతుంది. చట్టసభల్లో అతివలు తమ వాటాను అందుకున్న సంవత్సరమూ ఇదే కావడం విశేషం. విభిన్న రంగాల్లో, వినూత్న మార్గాల్లో దూసుకుపోయి తెగువ చూపిన మగువల విజయాలను స్మరించుకుంటూ ఈ అతివ నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుదాం.
భారతదేశంలో సంపన్న మహిళ సావిత్రీబాయి జిందాల్. 2023లో ఎక్కువ ఆదాయం ఆర్జించిన వారి జాబితాలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని తెలిపింది. ఈ క్రమంలో వ్యాపార దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ కూడా ఆమెకంటే తక్కువ మొత్తమే సంపాదించారు. ఈ ఏడాదిలో ఆమె 9.6 బిలియన్ డాలర్ల సంపద పెంచుకున్నారు. ప్రస్తుతం ఓపీ జిందాల్ గ్రూప్ సంస్థలకు సావిత్రి చైర్మన్గా ఉన్నారు. ఆమె 1950లో అసోం రాష్ట్రంలో జన్మించారు. జిందాల్ సంస్థల పగ్గాలు చేపట్టడానికి ముందు ఆమె భర్త ఓపీ జిందాల్కు అన్ని విధాలుగా చేయూతను అందించారు.
4 బిలియన్ల డాలర్లతో ఆమె 2016లో సంపన్న భారతీయుల్లో 16వ స్థానంలో ఉండేవారు. ఇప్పుడు 5వ స్థానానికి చేరుకున్నారు. 2005లో ఓపీ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అలా తన 55వ ఏట ఎలాంటి వ్యాపార శిక్షణ లేకుండానే జిందాల్ గ్రూప్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఆమె దీక్షాదక్షతల వల్ల జేఎస్డబ్ల్యూ గ్రూప్ విభిన్న రంగాలకు విస్తరించింది. అపారమైన వృద్ధిరేటు సాధించింది. వ్యాపారవేత్తగా లాభాలను ఆర్జిస్తూనే సావిత్రి తమ కంపెనీల్లో ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యమిచ్చారు. సమాజ సంక్షేమ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు. నాయకత్వం పాత్రలో స్త్రీలు కూడా రాణించగలరని నిరూపించారు. వివిధ కార్యకలాపాలతో స్త్రీ సాధికారతకు చురుగ్గా మద్దతునిస్తున్నారు. సావిత్రీబాయి 2005లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. భర్త మరణానంతరం హర్యానా శాసనసభకు ఎన్నికయ్యారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్గా సావిత్రి ఉక్కు, సిమెంట్, విద్యుత్, మౌలిక వసతుల రంగాల్లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ను విజయపథంలో నడిపిస్తున్నారు.
విద్యారంగంలో అత్యున్నత సేవలు అందించినవారికి వైజ్ పురస్కారం ఇస్తారు. దీన్ని ఖతార్ ఫౌండేషన్ ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది మనదేశంలో గ్రామీణ బాలికలు బడిబాట పట్టడానికి దీక్షతో కృషిచేస్తున్న సఫీనా హుస్సేన్ ఈ పురస్కారం అందుకున్నారు. ఆమె బాలికా విద్య కోసం ఎడ్యుకేట్ గర్ల్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ర్టాల్లోని 24వేల గ్రామాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ప్రభుత్వం, స్థానికులతో కలిసి సఫీనా చదువు మానేసిన అమ్మాయిలను మళ్లీ బడి బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు.
అలా ఇప్పటివరకు పద్నాలుగు లక్షల పైచిలుకు మంది ఆడపిల్లలు తిరిగి బడుల్లో చేరేలా కృషిచేశారు. మరో పంతొమ్మిది లక్షల మందికి ప్రత్యామ్నాయ విద్యా వసతులు అందుబాటులోకి తెచ్చారు. “నాకు ఈ గుర్తింపు దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తాను. బాలికల కోసం కృషి చేస్తున్న మా అందరి విజయమిది” అంటారు సఫీనా. ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలకు అమ్మాయిలు బాగా చదువుకోవడమే గొప్ప పరిష్కారం అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. అంతేకాదు చదువుకోవడం అమ్మాయిలకు సహజమైన హక్కు అంటారు. ఈ లక్ష్యం దిశగా ఎడ్యుకేట్ గర్ల్స్ నిబద్ధతతో ముందుకు సాగుతున్నదని సఫీనా చెబుతారు.
ఇక బడి మానేసిన బాలికలను గుర్తించడానికి ఆమె ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుంటున్నారు. అయితే, సాంకేతికతను ఎంతగా వాడుకున్నప్పటికీ మానవీయ కోణం ఉండాల్సిందే అంటారామె. వచ్చే పదేండ్లలో కోటి మంది బాలికలకు మంచి విద్య అందేలా కృషిచేయడం తమ లక్ష్యమంటున్నారు సఫీనా. కేవలం చదువుకోవడం మాత్రమే కాకుండా బాలికలకు ఉద్యోగం, నైపుణ్య అవకాశాల కల్పనపైనా దృష్టిపెడతామని ఆమె పేర్కొన్నారు. భారతదేశ బాలికలకు అపారమైన అవకాశాలు, బంగారు భవిష్యత్తుకు ఎడ్యుకేట్ గర్ల్స్ హామీ ఇస్తుంది.
తేజావత్ సుశీల తెలంగాణ నుంచి నేషనల్ ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారం అందుకున్న తొలి నర్సు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం సుశీల సొంతూరు. ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆగ్జిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్ (ఏఎన్ఎం)గా పనిచేస్తున్నారు. స్థానికంగా ఉండే గొత్తికోయ ఆదివాసులకు 25 ఏండ్లకు పైగా వైద్యసేవలు అందిస్తున్నందుకుగాను ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. తమ పల్లెలో కళాశాల విద్య వరకు వెళ్లిన తొలి మహిళ కూడా సుశీల కావడం గమనార్హం.
“రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అని తన సంతోషాన్ని పంచుకుంటారు సుశీల. నర్సుగా ఎంతోమంది శిశువులకు సుశీల ఊపిరిపోశారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్లో ఆమె 19 సంవత్సరాల కూతురు మరణించడం దురదృష్టకరం. “అవార్డుకు దరఖాస్తు పెట్టమన్నది నా కూతురే. నా అవార్డును తనకే అంకితం చేస్తున్నాను. ఈ సమయంలో మా అమ్మాయి లేదన్న సంగతి నమ్మలేకపోతున్నాను” అంటారు సుశీల. వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందించిన నర్సుల కోసం ప్రత్యేకంగా ఫ్లారెన్స్ నైటింగేల్ పేరుమీదుగా భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 1973 నుంచి ఈ పురస్కారం ఇవ్వడం మొదలుపెట్టింది.
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రాల జాబితాలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఈ ఏడాది ప్రపంచ సినీ రంగంలో ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్ దక్కింది. ఈ చిత్రానికి కార్తికి గోన్సాల్వెజ్ దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా కపూర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. గునీత్ నిర్మించిన ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్కు 2019లో కూడా ఆస్కార్ లభించడం విశేషం.
ఇక ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథ తమిళనాడులోని ముదుమలై పులుల అభయారణ్యం నేపథ్యంలో సాగుతుంది. ఈ అడవిలో అనాథలైన రెండు ఏనుగులను బెల్లీ, బొమ్మన్ దంపతులు ప్రేమగా పెంచి పెద్దచేసిన సంఘటన ఈ డాక్యుమెంటరీకి ప్రేరణనిచ్చింది. “ది ఎలిఫెంట్ విస్పరర్స్ భావోద్వేగాలను బాగా పండిస్తుంది. ఇంకా బేషరతు ప్రేమకు ఉదాహరణగా నిలిచే ‘ఏనుగంత’ కథ ఇది” అంటారు గునీత్ మోంగా.
భారతీయ రైల్వేలది 166 ఏండ్ల చరిత్ర. అంతేకాదు ప్రపంచంలో అతి ఎక్కువమంది ఉద్యోగులను కలిగిన సంస్థల్లో మన రైల్వే ఒకటి. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న భారతీయ రైల్వేకు ముఖ్య కార్యనిర్వాహక అధికారులు (సీఈవో)గా పనిచేసిన వాళ్లందరూ పురుషులే. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్) అధికారి జయ వర్మ సిన్హా తొలిసారిగా భారతీయ రైల్వేలకు చైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. ఈ స్థానానికి చేరుకున్న తొలిమహిళగా రికార్డు సృష్టించారు. ఈ పదవిలో ఆమె 2024 ఆగస్ట్ 31వరకు కొనసాగనున్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జయ వర్మ సిన్హా 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఉద్యోగిగా చేరారు.
ఉత్తర రైల్వే, ఆగ్నేయ రైల్వే, తూర్పు రైల్వే విభాగాల్లో సేవలందించారు. కాగా, భారతీయ రైల్వే బోర్డుకు చైర్మన్, సీఈవో కాకముందు ఆమె ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్లో సభ్యురాలిగా ఉన్నారు. భారతీయ రైల్వే శాఖ తరఫున సరకు, ప్రయాణికుల రవాణా బాధ్యతలను చూసుకున్నారు. అంతకుముందు రైల్వే బోర్డు ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ విభాగంలో అదనపు సభ్యురాలిగా ఉన్నారు. 35 ఏండ్ల ఉద్యోగ జీవితంలో జయ వర్మ సిన్హా భారతీయ రైల్వేలో వాణిజ్య, ఐటీ, విజిలెన్సు విభాగాల్లో వివిధ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు ఆగ్నేయ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్గా నియమితులైన తొలి మహిళ రికార్డూ ఆమె పేరిటే ఉంది. బంగ్లాదేశ్లో నాలుగేండ్లు భారత హైకమిషన్లో రైల్వే సలహాదారుగా ఉన్నారు. భారత్ బంగ్లా మధ్య నడుస్తున్న మైత్రి ఎక్స్ప్రెస్ ప్రారంభంలో ఆమె చొరవ కూడా ఉంది.
టెన్నిస్ ఆటలో భారతదేశ అమ్మాయిలకు స్ఫూర్తి ఎవరైనా ఉన్నారంటే… సానియా మీర్జానే అని చెప్పాలి. 2003లో మొదటి డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పుడు సానియా వయసు కేవలం 16 ఏండ్లు. మరుసటి ఏడాది ఆమె దక్షిణాఫ్రికా క్రీడాకారిణి లీజల్ హ్యూబర్తో కలిసి డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్ నెగ్గింది. ఇరవయ్యేండ్ల టెన్నిస్ జీవితంలో ఆమె 43 డబుల్స్, ఒక సింగిల్తో కలిపి మొత్తం 44 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలుచుకుంది.
ఆరుసార్లు మిక్స్డ్ డబుల్స్, ఉమెన్ డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిళ్లనూ అందుకుంది. నాలుగుసార్లు ఒలింపిక్స్కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఈ ఏడాది మార్చిలో దుబాయి టెన్నిస్ చాంపియన్షిప్ సానియా క్రీడాజీవితంలో చివరి మజిలీగా నిలిచిపోయింది. అక్కడ ఆమెకు ఘనమైన వీడ్కోలు లభించింది. “ఏ క్రీడాకారుడికైనా అత్యున్నతమైన పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది కల. నేను దాన్ని సాకారం చేసుకున్నాను” అని భారతదేశం తరఫున ఆడినందుకు సానియా గర్విస్తుంది.
నడిమిదొడ్డి అంజమ్మ ‘తెలంగాణ చిరుధాన్యాల మహిళ’ (మిల్లెట్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ)గా పేరుగాంచారు. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం గంగ్వార్ గ్రామానికి చెందిన అంజమ్మకు పదేండ్ల వయసులోనే పెండ్లయింది. అత్తగారింట్లో రైతు కూలీగా జీవితం మొదలుపెట్టారు. ఆ తర్వాత కౌలు రైతుగా మారారు. సేద్యంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యమిచ్చిన అంజమ్మ ఇప్పుడు పదెకరాల ఆసామి. ఈ ముచ్చట అలా ఉంచితే ఈ ఏడాది (2023) చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలు పండిస్తున్న కొంతమంది గురించి ఓ ప్రత్యేక వెబ్ సంచిక విడుదల చేసింది.
ఆ జాబితాలో అంజమ్మకూ చోటు దక్కింది. అలా తెలంగాణ పల్లె మహిళ అంతర్జాతీయ వార్తల్లో నిలిచింది. పన్నెండు రకాల చిరుధాన్యాలు పండించే అంజమ్మ దగ్గర దాదాపు 80 రకాల వర్షాధార పంటల విత్తనాలు ఉన్నాయి. స్థానికంగా దొరికే పంటల విత్తనాలు భద్రపరుస్తున్నందుకు ఆమెకు 2015లోనే కేంద్ర ప్రభుత్వం ‘ప్లాంట్ జీనోమ్ సేవియర్’ అవార్డు ఇచ్చి గౌరవించింది. “మేం విత్తనాలు అమ్మం. అవసరమైన వారికి పంట పండిన తర్వాత రెట్టింపు విత్తనాలు ఇచ్చే హామీతో ఇచ్చిపుచ్చుకుంటాం. అంతే! ఈ విధానం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి ఉపకరిస్తుంది. మా సుస్థిర అభివృద్ధికి స్వావలంబన విధానాన్ని అనుసరిస్తున్నాం” అని తన విజయగాథను వినిపిస్తారు అంజమ్మ.
ఒంటికొమ్ము ఖడ్గమృగం పేరు చెప్పగానే అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్ గుర్తొస్తుంది. బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతంలో నెలవైన ఈ జాతీయ ఉద్యానవనం 1,355 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో దాదాపు 2,600 ఖడ్గమృగాలు ఉన్నాయని అంచనా. వీటితోపాటు పులులు, ఏనుగులు, ఎన్నో రకాల జంతువులు, పక్షులకు ఇది ఆవాసం. 1905లో ఏర్పాటైన కజిరంగా నేషనల్ పార్కులో 118 ఏండ్లుగా పురుషులే ఫీల్డ్ ఆఫీసర్లుగా వ్యవహరించారు.
ఈ ఏడాది ఆగస్ట్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సోనాలి ఘోష్ ఫీల్డ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా ఆమె వార్తల్లో నిలిచారు. సైన్యాధికారుల కుటుంబంలో జన్మించిన సోనాలి చిన్నతనం నుంచే అడవులు, వన్యమృగ సంరక్షణ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. 2000- 2003 మధ్యకాలంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ శిక్షణ పూర్తి చేసుకున్న సోనాలి తన బ్యాచ్లో టాపర్గా నిలిచారు.
అక్టోబర్ 8న ప్రయాగరాజ్ దగ్గర్లోని బమ్రౌలీలో 91వ భారతీయ వైమానిక దళ దినోత్సవం జరిగింది. అప్పుడు నిర్వహించిన పరేడ్ను తొలిసారిగా మహిళా అధికారి, గ్రూప్ కెప్టెన్ శాలిజా ధామి ముందుండి నడిపించారు. అంతేకాదు ఈ పరేడ్లో వైమానిక దళంలో కొత్తగా నియమితులైన ‘అగ్నివీర్ వాయు’ మహిళా సైనికులు కూడా పాల్గొన్నారు. అలా పరేడ్లో అందరూ మహిళలే ఉన్న దళం పాల్గొనడం కూడా తొలిసారి కావడం విశేషం. గ్రూప్ కెప్టెన్ శాలిజా ధామి హెలికాప్టర్ పైలట్. ఆమె 2003లో వాయుసేనలో విధుల్లో చేరారు.
ఈ ఏడాది మార్చిలో ఆమె భారతీయ వాయుసేన పోరాట దళం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా రికార్డు సాధించారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ సెక్టార్ మిసైల్ స్కాడ్రన్కు నాయకత్వం వహిస్తున్నారు. ఒక్క శాలిజ మాత్రమే కాదు… భారతీయ నావికా దళంలో ఒక యుద్ధనౌకకు మార్గనిర్దేశం చేసే బాధ్యతల్లో కమాండర్ ప్రేర్ణా దేవస్థలి, వాయుసేనలో వీరోచిత పురస్కారం అందుకున్న వింగ్ కమాండర్ దీపికా మిశ్రా, ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్లో తొలి మహిళా సైన్యాధికారిగా నియమితులైన కెప్టెన్ శివ చౌహాన్ మొదలైనవాళ్లు పురుషులకే ప్రత్యేకంగా భావించే సైనిక దళాల్లో అత్యంత కీలక బాధ్యతలు చేపట్టి 2023 సంవత్సరంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. నవతరం అమ్మాయిలకు స్ఫూర్తిప్రదాతలు అయ్యారు.
నాగాలాండ్ రాష్ట్రం 1963లో ఏర్పడింది. అప్పటినుంచి ఆ రాష్ట్ర శాసనసభకు మహిళలు ఎవ్వరూ ఎన్నిక కాలేదు. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఇద్దరు మహిళలు శాసనసభలో అడుగుపెట్టారు. సల్హవుతునో క్రూజ్, హెకానీ జఖాలు… ఇద్దరూ అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. హెకానీ జఖాలు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు. అమెరికాలో న్యాయశాస్త్రం చదువుకున్నారు.
లింగ సమానత్వం కోసం కృషి చేసినందుకు జఖాలు భారత ప్రభుత్వ నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. నాగాలాండ్ యువతను సాధికారత సాధించే దిశగా నడిపించడానికి ఆమె ‘యూత్నెట్’ అనే సంస్థను స్థాపించారు. సల్హవుతునో హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.